ఏపీలో ఎన్నికల వేళ…రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అమరావతినే కొనసాగించాలని పవన్, చంద్రబాబు పట్టు పడుతుండగా జగన్ మాత్రం ససేమిరా అంటున్నారు. విశాఖనే ఏపీకి రాజధాని అంటూ మరోసారి కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. సీఎంగా విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానంటున్నారాయన. మరోసారి న్యాయ, శాసన రాజధానులపైనా సీఎం వైఎస్ జగన్ మనసునలోని మాట విప్పేశారు. కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. అమరావతి కేవలం శాసన రాజధాని మాత్రమే అని చెప్పారు. ఈ లెక్కన మూడు రాజధానుల నినాదంతోనే తాను ఎన్నికలకు వెళ్తున్నట్లు జగన్ చెప్పకనే చెప్పేశారు అంటే తాను గెలిస్తే మూడు రాజధానులకు ప్రజలు ఓటేసినట్లే అనేది ఆయన భావన. ఇదే తరుణంలో అమరావతే రాజధాని అంటున్నారు పవన్, చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలవబోయేది తామే అని, తాము అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతికి పట్టం కడతామని చంద్రబాబు చెబుతున్నారు. దీంతో ఎన్నికల్లో ఏపీ రాజధాని అంశం కీలక పాత్ర పోషించబోతోంది. జగన్ విశాఖ, పవన్, చంద్రబాబు జై అమరావతి అంటుంటే జగన్ మాత్రం జై వైజాగ్ అంటున్నారు. ఏపీ ప్రజల్లో మాత్రం అమరావతి ఫీలింగే బలంగా ఉందని పవన్, చంద్రబాబు నమ్ముతున్నారు. ఈ తరుణంలో మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎటువైపు? వారి నిర్ణయం ఎలా ఉండబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Tag: