ఇవాళ తిరుపతికి వెళ్లనుంది సీఎం చంద్రబాబు కుటుంబం. రేపు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా చంద్రబాబు ఫ్యామిలీ ఏటా స్వామివారిని దర్శించుకొని..స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ తిరుమలకు వెళ్లనున్న నారా ఫ్యామిలీ..రేపు తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో దేవాన్ష్ పేరుతో అన్నప్రసాదాలు అందించనున్నారు. ఆ తర్వాత తిరుమలలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు సీఎం చంద్రబాబు.
CM
రాష్ట్రంలో అకాల వర్షం కురిసిన విషయం తెలిసిందే. అయితే పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 1,215 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 267 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సీఎంకి అధికారులు వివరించారు. ఆరు జిల్లాల్లోని 16 మండలాలు, 89 గ్రామాలపై వర్షాల ప్రభావం తీవ్రంగా పడిందని, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, పార్వతీపురం మన్యం, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పంటల వారీగా చూస్తే 630 హెక్టార్లలో మొక్కజొన్న, 384 హెక్టార్లలో వరి, మరో 200 హెక్టార్లలో మినుము వంటి పంటలు నీటి పాలయ్యాయని తెలిపారు. అటు అరటి, మామిడి వంటి ఉద్యాన పంటలకు కూడా భారీగా నష్టం కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు న్యాయం జరిగేలా, ప్రతి ఎకరా నష్టాన్ని ఖచ్చితంగా లెక్కించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. నష్టపరిహారం చెల్లింపులో పారదర్శకత పాటిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను సీఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామన్నారు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి. రైతును రాజుగా చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న సీఎం..పంచాంగ శ్రవణం అనంతరం ప్రసంగించారు. ఉగాది ప్రధానంగా రైతుల పండుగ అని.. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో ఉంటుందన్నారు. తెలంగాణలో 70 శాతం వ్యవసాయ ఆధారిత కుటుంబాలే ఉన్నాయన్న ముఖ్యమంత్రి..రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తుల్ని చేశామన్నారు. రైతులు ఆత్మగౌరవంతో బతికేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతు భరోసా ద్వారా ఇప్పటికే 18వేల కోట్ల రూపాయలిచ్చామని..ఈనెల 22 నుంచి మళ్లీ రైతు భరోసా ప్రారంభమవుతుందని తెలిపారు.
ఇవాళ మంగళగిరిలో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్. APSRTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించేలా ఈ దివ్యాంగ శక్తి పథకాన్ని అమలుచేయనుంది ప్రభుత్వం. అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ‘దివ్యాంగ శక్తి’ని ప్రారంభించనున్నారు. గతేడాది డిసెంబరు 3న దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు సిఎం చంద్రబాబు. ఈ మేరకు ఆ పథకాన్ని ఇవాల్టి నుంచి అమలు చేయనున్నారు. మంగళగిరిలో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లనున్నారు పవన్ కల్యాణ్. ముఖ్యమంత్రిపై భేటీయై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.
కలెక్టర్ల సదస్సులో అటవీశాఖాధికారులపై మండిపడ్డారు సీఎం చంద్రబాబు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని మండిపడ్డారు. ఎంత చెప్పినా మీలో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అటవీ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి నివసిస్తున్న ప్రజలకు నీళ్లివ్వకూడదు, కరెంటివ్వకూడదు, ఇళ్లు కట్టకూడదని అభ్యంతరం పెడితే ఎలా? ఇలాంటి ఆలోచనా విధానం వల్లే సమస్యలొస్తున్నాయని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అటవీశాఖ అధికారులు ప్రతిదానికీ అడ్డంకులు పెడుతున్నారని, ఏ పనీ ముందుకు సాగనివ్వడం లేదని కొందరు కలెక్టర్లు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారి తీరుపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు.
నెట్ఫ్లిక్స్ హైదరాబాద్ వచ్చిందంటే హాలీవుడ్ వచ్చినట్లేనని సీఎం రేవంత్ అన్నారు. ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఐలైన్ స్టూడియో కార్యాలయాన్ని హైటెక్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. హైదరాబాద్ అన్ని అవకాశాలను కల్పిస్తుందని నెట్ ఫ్లిక్స్ కు మా ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు. బాల్యం నుంచే తనకు సినిమాలపై ఆసక్తి ఉందని తన చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమాలో అనేక మార్పులు వచ్చాయన్నారు. బాహుబలి, కల్కి, ట్రిపుల్ ఆర్, అరుంధతి వంటి అత్యున్నత సాంకేతికతో కూడిన సినిమాలు వచ్చాయని గుర్తు చేశారు. తెలుగు చిత్రపరిశ్రమను చెన్నై నుంచి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాద్కు తీసుకు వచ్చారన్నారు.
నెట్ ఫ్లిక్స్ కు దేశంలోనే హైదరాబాద్ ది రెండో కార్యాలయం అని సీఎం చెప్పారు. తమ దృష్టి హాలివుడ్ పైననే అని గతంలోనే చెప్పానని అన్నారు సీఎం. నెట్ ఫ్లిక్స్ తో తన కల నిజం కాబోతుందన్నారు. ఫోర్త్ సిటీని నిర్మిస్తున్నామని, విస్తరణకు.. పెద్ద ఆఫీస్ నిర్మాణానికి కావాల్సిన భూమి ఫ్యూచర్ సిటీలో ఇవ్వడానికి సిద్ధంగా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నెట్ ఫ్లిక్స్ కార్పొరేట్ ఆఫీస్ ను ఫ్యూచర్ సిటీకి తీసుకురావాలని కోరుతున్నానన్నారు. ప్రపంచంలో ఉన్న 500 పెద్ద కంపెనీలు తెలంగాణ కు తీసుకు రావడానికి ప్రయత్నం చేస్తున్నామని పెట్టుబడులకు పూర్తి రక్షణ ఉంటుందని భరోసా ఇచ్చారు. తెలంగాణ అంటేనే వ్యాపారం అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిని దీర్ఘకాలిక దృష్టితో ముందుకు తీసుకెళ్లాలని, 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు, పురోగతి, భవిష్యత్ అవసరాలపై అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2047 విజన్ డాక్యుమెంట్కు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లా కేంద్రానికి రింగ్ రోడ్డు అభివృద్ధి చేసే అంశాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే ఆ రింగ్ రోడ్లను జాతీయ, రాష్ట్ర హైవేలతో అనుసంధానించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సాధ్యాసాధ్యాలను సమగ్రంగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. ఇక ఆరోగ్య రంగంపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల భవనాల పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేలా ఆసుపత్రి భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు.
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సీఎం వారికి పలు అంశాలపై లక్ష్యాలను నిర్దేశించారు. సంక్షేమ, అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని సూచించారు. అధికారులు-ప్రజాప్రతినిధుల కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటించారు. ఇండియన్ బిజినెస్ స్కూల్ తరహాలో వ్యవసాయం కోసం అత్యున్నత సంస్థ తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలు దీర్ఘకాలంలో ప్రభావం చూపిస్తాయన్నారు. పేదల కోసమే కూటమి ప్రభుత్వం నిరంతరాయంగా పనిచేస్తోందని అన్నారు సీఎం చంద్రబాబు. స్వచ్ఛాంధ్రపై సీరియస్గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని కలెక్టర్లకు సూచించారు. పరిమిత వనరులతోనే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్సు చేస్తున్నామని సీఎం తెలిపారు. కౌలు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి నిబంధనలు అడ్డంకిగా ఉన్నా వాటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ పాలనలో ట్రూఅప్ పేరిట విద్యుత్ ఛార్జీల భారం వేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూడౌన్ చేశామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు.
తెలంగాణ పోలీస్ ఆఫీసర్స్ రిట్రీట్–2026 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అధికారులను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పోలీస్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సమాజంలో ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు ముందుగా ఆశ్రయించేది పోలీసులనే అని ఆయన గుర్తుచేశారు. రిట్రీట్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం సమస్యలను గుర్తించి వాటి పరిష్కార మార్గాలను కనుగొనడమేనని సీఎం తెలిపారు. మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకుంటే, భవిష్యత్తులో ఎక్కడికి చేరుకోవాలో స్పష్టత వస్తుందని అన్నారు. అందుకే ఈ కార్యక్రమం ద్వారా పోలీస్ శాఖలో ఎదురవుతున్న సమస్యలను విశ్లేషించుకుని వాటికి తగిన పరిష్కారాలపై చర్చించామని వివరించారు. సమస్యలు సాధారణంగా రెండు రకాలుగా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఒకటి టెక్నికల్ ఛాలెంజ్ కాగా, మరొకటి అడాప్టివ్ ఛాలెంజ్ అని పేర్కొన్నారు. టెక్నికల్ సమస్యలను వనరులు మరియు సమయం కేటాయిస్తే పరిష్కరించవచ్చని తెలిపారు. అయితే అడాప్టివ్ ఛాలెంజ్ విషయంలో సమస్య యొక్క అసలు కారణాలను లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి శాంతిభద్రతలు అత్యంత ముఖ్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ దిశగా రాష్ట్రంలో పాలసీ పెరాలసిస్ లేకుండా ముందుకు సాగేందుకు “తెలంగాణ రైజింగ్ 2047” అనే పాలసీ డాక్యుమెంట్ను ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని సుమారు 2100 కిలోమీటర్ల ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్గా అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.
దేశంలోని ఇతర మెట్రో నగరాల పరిస్థితులను కూడా సీఎం ఉదాహరణగా ప్రస్తావించారు. ఢిల్లీ నగరం కాలుష్య సమస్యతో బాధపడుతుండగా, బెంగళూరు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోందని అన్నారు. ముంబై, చెన్నై నగరాలు వరదల సమస్యను తరచుగా ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకుని తెలంగాణలో ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. పోలీసింగ్ వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. ఒకప్పుడు తీవ్రవాదం పెద్ద సమస్యగా ఉండేదని, దాన్ని ఎదుర్కొనేందుకు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఫిజికల్ క్రైమ్ నియంత్రణ కోసం ఇప్పటివరకు పలు వ్యవస్థలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం నేరాల స్వరూపం మారిందని తెలిపారు.
ప్రస్తుతం సైబర్ క్రైమ్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్ వ్యవస్థను కూడా సాంకేతికంగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం కలిగిన అధికారులను నియమించుకోవడంతో పాటు ఇప్పటికే ఉన్న సిబ్బందికి కూడా నూతన శిక్షణ ఇవ్వాలని సూచించారు. పోలీస్ శాఖలో సిబ్బంది మరియు అధికారులను నిరంతరం అప్డేట్ చేయకపోతే నేరాలను సమర్థవంతంగా అడ్డుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ రిట్రీట్ కార్యక్రమంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్, రిక్రూట్మెంట్ తదితర అంశాలకు సంబంధించిన పలు సమస్యలపై అధికారులు తమ ప్రతిపాదనలు సమర్పించినట్లు సీఎం తెలిపారు. ఈ ప్రతిపాదనలను సమగ్రంగా పరిశీలించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా అవసరమైతే చట్టపరమైన మార్పులు తీసుకొచ్చే అవకాశముందని తెలిపారు.
జనాభా నిర్వహణపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చిందని సీఎం చంద్రబాబు అన్నారు. లేకపోతే భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. 1.5 ఉన్న టీఎఫ్ఆర్ను 2.1కు తీసుకెళ్లటం మన లక్ష్యమని వెల్లడించారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లల్ని కంటే కాన్పు సమయంలోనే రూ.25 వేలు ఇస్తామని ఈ నగదు పురస్కారం గేం ఛేంజర్ కానుందని భావిస్తున్నామని అన్నారు. జనాభా నిర్వహణపై ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో చర్చలు జరపాలని ఆ చర్చల తర్వాత పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ రూపొందిస్తామని సీఎం వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీని అమలు చేస్తామని, పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ నిలుస్తుందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.




Total views : 81441