క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణలో ఇసుక లారీ యజమానులు, కార్మికులు నిరసన బాట పట్టారు. రైతు, కార్మిక సంఘాలకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో ‘జైల్ భరో’, నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఇసుక లారీల సంఘం అధ్యక్షుడు సుర్వీ యాదయ్య నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, లారీ యజమానులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రవాణా రంగంలోని కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన చట్టాలను వెంటనే రద్దు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాను అరికట్టాలని కోరారు. నాణ్యత లేని ఫిల్టర్ ఇసుక వ్యాపారాన్ని తక్షణమే నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ ఉచిత ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇసుక రీచ్లలో అక్రమంగా వసూలు చేస్తున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని సంఘం నాయకులు హెచ్చరించారు.
క్విట్ ఇండియా స్ఫూర్తితో ఇసుక లారీ యజమానుల ‘జైల్ భరో’.
42