Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Devotional దేవతలు నిర్మించిన పవిత్ర నగరం.. రామజన్మభూమి అయోధ్య

దేవతలు నిర్మించిన పవిత్ర నగరం.. రామజన్మభూమి అయోధ్య

by Satya
Ram Janmabhoomi Ayodhya

హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన ‘అయోధ్య’ ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు. రామాయణాన్ని ఒక మహా కావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి, హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకే కాదు.. ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ రామ జన్మభూమి విశేషాలు ఏమిటి? ప్రజలతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధం ఏమిటి? పర్యాటకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య చరిత్ర:
అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. శ్రీరాముని పూర్వీకుడైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కధనం. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కధనాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు. సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్య వాక్కుతో సూర్య వంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భువికి దించిన భగీరధుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరధుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరధుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీ రాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంత కాలం రాజ్య పరిపాలన చేశాడు. అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి, సుందరి, పాడలిప్తసూరీశ్వరి, హరిచంద్ర, అచలభరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మతతీర్ధంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది.
హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్ధం వరకూ అయోధ్య బౌద్ధ మత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా. అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలు మార్లు సందర్శించినట్లు కూడా కధనం. అదే విధంగా మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీంతో హిందూ, బౌద్ధ, జైన, ముస్లిం మతాల పవిత్ర ప్రదేశంగా అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభించింది.
అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు:
అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు. సరయూ నది, రామజన్మభూమి ఆలయం ప్రదేశం, అన్నదాన సమాజం, కౌసల్యాదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం వంటివి ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనవి.

Advertisements

You may also like

Our Visitor

039827
Total views : 200952

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: