జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై గిరి ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ ఆంజనేయస్వామి తదితర దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఘాట్ రోడ్ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దేవస్థానం స్థానాచార్యులు వేదమంత్రోచ్చారణల మధ్య పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
దేవస్థానం ఆధ్వర్యంలో సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళవాయిద్యాల నడుమ గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఘాట్ రోడ్, కుమ్మరిపాలెం, విద్యాధరపురం, పాలప్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణవీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రి వరకు నిర్ణయించిన మార్గంలో ఊరేగింపు సాగింది.మార్గమధ్యంలో స్థానిక మహిళలు పసుపు నీటితో రహదారులను శుద్ధి చేసి, హారతులు ఇస్తూ కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారికి స్వాగతం పలికారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు కుంకుమ, ప్రసాదాలను దేవస్థానం పంపిణీ చేసింది.వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా ఘనంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ.
49





Total views : 180088