ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో నగరం అతలాకుతలమవుతోంది. ప్రధాన రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, ఇళ్లు కూలిపోతున్నాయి. భారీ వర్షాలకు ముంబై మాన్ఖుర్ద్లోని జనతానగర్లో ఘోర ప్రమాదం జరిగింది. 4 అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది మహారాష్ట్ర ప్రభుత్వం.
ఐతే రానున్న 5 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణశాఖ హెచ్చరికలతో..విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది. ఇక ముంబైలో 24 గంటల్లో 200 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో వీధులన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. చాలా చోట్ల చెట్లు కూలడంతో కొందరు మృత్యువాత పడ్డారు. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమానాలు రద్దు చేశారు, మరికొన్ని దారి మళ్లించారు. ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అత్యవసరం ఉంటే తప్ప ప్రజలు ఇళ్లనుంచి బయటికి రావొద్దని హెచ్చరించారు అధికారులు. అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. థానే, నవీ ముంబై, పాల్ఘర్ వంటి సమీప ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.





Total views : 193054