ఇక అంతకుముందు దక్షిణ కొరియా రాజధాని సియోల్లో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఏపీలో కొరియా పెట్టుబడులను ఆకర్షించే అంశంపై విస్తృతంగా చర్చించారు.ఇండియా సెమీకండక్టర్ మిషన్, ఏపీ ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0కు అనుగుణంగా శాంసంగ్, ఎల్జీ, ఎస్కె తదితర కొరియా ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ దిగ్గజాలను ఏపీకి తీసుకురావడంలో సహకరించాలని రాయబారిని మంత్రి కోరారు. శ్రీసిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖపట్నంలో రెడీ-టు-యూజ్ పారిశ్రామిక క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
ఐఐటీ తిరుపతి, ఐఐఐటీ శ్రీసిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయాలతో కలిసి కొరియా అనుసంధాన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రతిపాదించారు. అలాగే, కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యుంగ్ భారత్ పర్యటన సందర్భంగా ప్రతిపాదించిన “కొరియా ఎన్క్లేవ్”కు కార్యరూపం దాల్చేలా శ్రీసిటీలో కొరియా ఎంఎస్ఎంఈల కోసం ప్లగ్-అండ్-ప్లే టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉందని తెలిపారు.అనంతపురంలోని కియా–హ్యుందాయ్ మోబిస్ ఆటో-ఈవీ క్లస్టర్ విస్తరణ, ఏపీ తీరంలో హెచ్డీ హ్యుందాయ్ తరహా గ్రీన్ఫీల్డ్ షిప్యార్డ్ ఏర్పాటు, బ్యాటరీలు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల స్థాపన అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు.





Total views : 192836