రుతుపవనాల ప్రభావంతో హర్యానాలోని గురుగ్రామ్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీటమునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వర్షాల ప్రభావంతో ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారి ఎన్హెచ్-48పై నర్సింగ్పూర్ ప్రాంతంలో రహదారి ఒక్కసారిగా కుంగిపోవడంతో భారీ గుంత ఏర్పడింది. దీంతో ఐఎఫ్ఎఫ్సీఓ చౌక్ నుంచి నర్సింగ్పూర్ వరకు దాదాపు 8 నుంచి 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. వేలాది వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి.
హైవే దెబ్బతిన్న వెంటనే జిల్లా యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై జైపూర్ వైపు వెళ్లే వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, రహదారి కుంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.గురుగ్రామ్లోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా రహదారులు కుంగిపోయాయి. ఒకచోట గుంతలో ఎస్యూవీ వాహనం ముందు చక్రాలు ఇరుక్కుపోగా, జిల్లా కలెక్టర్ నివాసం, రాష్ట్ర మంత్రి నివాసం సమీపంలో కూడా రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు నగరంలోని ప్రధాన రహదారులపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కార్లు, బస్సులు, లారీలు నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్లే వాహనదారులు ఎన్హెచ్-48లో ప్రభావిత ప్రాంతాన్ని నివారించాలని, రాజీవ్ చౌక్, సదర్న్ పెరిఫెరల్ రోడ్, హీరో హోండా చౌక్, ద్వారకా ఎక్స్ప్రెస్వే వంటి ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు కొనసాగుతున్నాయని, ప్రజలు ట్రాఫిక్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






Total views : 192960