Friday, July 17, 2026
News Navigation
Friday, July 17, 2026
News Navigation

Breaking

Friday, July 17, 2026
Home Andhra Pradesh కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి.

కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి.

by CVR NEWS
కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి

నదుల అనుసంధానం చేస్తే.. రాష్ట్రానికి కరవు ఉండదని అన్నారు సీఎం చంద్రబాబు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర కృష్ణా-గోదావరి నదీ సంగమం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండాలని ఆకాంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆ తర్వాత సాగునీటి రంగానికి విశేష సేవలు అందించిన ప్రముఖ ఇంజనీర్ కేఎల్ రావు 124వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంజనీరుగా కేఎల్ రావు అందించిన స్ఫూర్తిని రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ తీసుకెళ్లేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. జలవనరులే అభివృద్ధికి మూలమని స్పష్టం చేశారు. నదుల అనుసంధానం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించి, రాష్ట్రాన్ని కరవు రహితంగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మార్చి 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా-వంశధార నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో రూ.35వేల కోట్లు ఖర్చు చేసి..36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గంగా-కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు.

నాడు ఉమ్మడి ఏపీలో తాము హైటెక్ సిటీ నిర్మిస్తుంటే దండగ అన్నారని, కానీ ఇప్పుడు హైదరాబాద్ ఐటీకి అంతర్జాతీయ కేంద్రంగా నిలిచిందని సీఎం గుర్తుచేశారు. ఇప్పుడు అమరావతిని కూడా అద్భుతమైన నగరంగా నిర్మిస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షంలోని కొందరు రాజకీయం కోసం రైతుల్ని రెచ్చగొట్టి చివరకు సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఆగస్టు 15 కల్లా సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వస్తుందని సీఎం స్పష్టం చేశారు.

దేశంలో నదుల అనుసంధానం జరిగితే అద్భుతమైన అవకాశాలు ఉంటాయని, గోదావరి-కావేరి అనుసంధానాన్ని కేఎల్ రావు నాడే ప్రతిపాదించగా, వాజపేయి హయాంలో గంగా-కావేరి అనుసంధానం కోసం టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం వాగులు, వంకలు, నీటి ఊటలు అడుగంటిపోతున్న తరుణంలో భూగర్భ జలాలను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా పటిష్ట చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040829
Total views : 212134

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: