దక్షిణ కొరియాలో పెట్టుబడుల వేటకు ఏపీ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టారు. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో కొరియా మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు వివరించనున్న లోకేష్.. ప్రముఖ టెక్ కంపెనీల ప్రతినిధులతో పాటు స్టార్టప్ సంస్థలతో రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొననున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఆధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది.
Andhra Pradesh
స్వర్ణకుప్పం విజన్–2029 రూపకల్పనపై సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తన క్యాంప్ కార్యాలయంలో సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్వర్ణకుప్పం విజన్–2029 కోసం రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.వ్యవసాయం, పర్యాటక రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కుప్పం భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, ఉద్యానవన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద, ప్రజల జీవన విధానం, ఆదాయ వనరుల గురించి సీఎం వివరించారు.
కుప్పం అభివృద్ధికి అన్ని రంగాలను కలుపుకొని సమగ్ర విజన్ ప్లాన్ రూపొందించాలని సూచించిన సీఎం, కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రతిపాదించాలని కోరారు.యువత మరియు స్థానిక ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, అందుబాటులో ఉన్న వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు సూచించారు.
కుప్పానికి ఉన్న సహజ, భౌగోళిక, ఆర్థిక అనుకూలతలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ప్రాజెక్టులను రూపొందించాలని సీఎం సూచించారు.అలాగే, కుప్పంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాంతాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.
సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రతి కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందేలా చేయడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. కుప్పంలో నిర్వహించిన కార్యక్రమంలో పీ-4 కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సాధికారతకు కొత్త దిశగా నిలుస్తుందని పీ-4 తెలిపారు. సమాజంలో ఆర్థికంగా బలమైన, బంగారు కుటుంబాలు వెనుకబడిన కుటుంబాలకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. పేదరిక నిర్మూలన, విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. ప్రభుత్వం, ప్రజలు, పారిశ్రామికవేత్తలు, దాతలు కలిసి పనిచేస్తే ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి బాటలో నడిపించవచ్చని, అదే పీ-4 కార్యక్రమం అసలు లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పోలవరం జిల్లా పాపికొండల విహారయాత్రకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 18 రోజుల విరామం తర్వాత నేటి నుంచి దేవీపట్నం మండలం పోచమ్మగండి బోటు పాయింట్ నుంచి పర్యాటక బోట్లను తిరిగి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఐదు శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ప్రతి బోటును క్షుణ్ణంగా పరిశీలించి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే విహారయాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.విహారయాత్రకు వెళ్లే ప్రతి పర్యాటకుడు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ ధరించాలని, భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచించారు. దేవీపట్నం మండలం నుంచి పాపికొండల వరకు బోటు విహారయాత్రలు యథావిధిగా కొనసాగనున్నాయి.
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పొగురుపల్లెలో రూ.200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఏబీఐఎస్ ప్రోటీన్స్ అత్యాధునిక గ్రీన్ఫీల్డ్ చికెన్ ప్రాసెసింగ్ యూనిట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. 30.75 ఎకరాల్లో నిర్మించిన ఈ పరిశ్రమను సందర్శించిన సీఎం, వివిధ విభాగాలను ప్రారంభించి యూనిట్ పనితీరును పరిశీలించారు. ఈ నెల నుంచే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కానున్న ఈ పరిశ్రమ ద్వారా సుమారు 1,400 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది. ప్రారంభ దశలోనే 300 నుంచి 400 మందికి ఆఫర్ లెటర్లు అందజేయగా, స్థానిక కోళ్ల పెంపకందారులకు కూడా ఈ ప్రాజెక్టు ప్రయోజనం చేకూరనుంది.
లోక్భవన్లో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్తో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిణామాలపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు చేస్తున్న వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాల తీరును ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి పవన్ కల్యాణ్ తీసుకెళ్లారు. సమాజంలో అతి ధోరణులు పెరిగిపోతుండంపై గవర్నర్కు వివరించారు. దుష్ప్రచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం తరఫున, చట్టపరంగా ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతున్నారనే విషయాలను గవర్నర్కు పవన్ కల్యాణ్ వివరించారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తేనే ఇటువంటి వాటికి అడ్డుకట్ట వేయవచ్చని గవర్నర్కు ఈ భేటీలో పవన్ కల్యాణ్ వివరించినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీత దోరణులు ఎక్కువయ్యాయి. నచ్చకపోతే ఇష్టమొచ్చిన రీతిలో పోస్టులో పెడుతున్నారు. నోటికి వచ్చిన బూతులు తిడుతున్నారు. అయితే ఈ అతి పోకడపై పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. కఠినంగా శిక్షిస్తామని అధికారికంగా పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇందులో భాగంగానే గవర్నర్తో భేటీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలపై గవర్నర్ క వివరించినట్లు తెలుస్తోంది.
రాయలసీమకు స్వర్ణయుగం ప్రారంభమైందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో రాయలసీమ చరిత్రలో నవశకం మొదలైందని, రాయలసీమ బిడ్డగా అభివృద్ధి చేసి చూపెడుతానని చంద్రబాబు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ విధానాల దుష్పలితాలపై చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రజల్ని భ్రమల్లో పెట్టి..రాష్ట్రాన్ని..ఖజానాను కొల్లగొట్టారన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లి వద్ద జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ, జేఎస్డబ్ల్యూ గ్రూప్ అధినేత సజ్జన్ జిందాల్తో కలిసి ఆయన కాంక్రీట్ వేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు విజయనగరం జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్కును వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, సవిత, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. రాయలసీమ ప్లాంటుతో ఏపీ ఉక్కు రాష్ట్రంగా తయారైందని సీఎం చంద్రబాబు అన్నారు…విశాఖ ప్రాంతమే కాదు..తన రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా మారుతోందన్నారు.
భారత్ లో మొట్టమొదట గ్రీన్ ఎనర్జీతో…గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే ప్లాంట్ మన ప్రాంతానికి రావడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు.
ఏపీలో ఖనిజ సంపద పుష్కలంగా ఉందనీ…. రోడ్డు..ఏరో..రైల్వే కనెక్టవిటీ సమీపంలోనే రామాయంపట్నం పోర్టు ఉందన్న చంద్రబాబు….ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే బ్రహ్మండగా ముందుకుపోయే అవకాశం ఉందన్నారు. ఎవరివల్ల రాయలసీమ కు మంచి జరిగింది..ఎవరి వల్ల నష్టం జరిగిందనేది ప్రజలు గుర్తు చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపు ఇచ్చారు.
అనంతపురం జిల్లా దశాదిశా మారిందన్న చంద్రబాబు..అదే సమయంలో 2007 గుర్తుపెట్టుకోండి… గత ప్రభుత్వం బ్రహ్మణీ స్టీల్ ప్లాంట్ కోసమని 14 వేల ఎకరాలిచ్చింది… 2026 వచ్చినా ఎలాంటి పురోగతి లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని భ్రమల్లో పెట్టి అందినకాడికి దండుకున్నదని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. అంతకుముందు స్టీల్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన ఎక్స్పీరియన్స్ సెంటర్ను సీఎం చంద్రబాబు ఆసక్తిగా పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మినియేచర్ మోడల్, నియో ఎనర్జీ ప్లాంట్ వివరాలను సజ్జన్ జిందాల్ ఆయనకు వివరించారు. హైదరాబాద్లో జేఎస్డబ్ల్యూ తయారుచేస్తున్న డిఫెన్స్ డ్రోన్ షీల్డ్ ఏఐ టెక్నాలజీ గురించి సీఎం ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. రక్షణ, పౌర అవసరాలకు డ్రోన్ల తయారీపై దృష్టి సారించాలని, కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ సిటీలోని వసతులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. విపత్తుల సమయంలో వినియోగించే ప్రత్యేక వాహనాలను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.
భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాల రంగంలో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం కీలక కేంద్రంగా ఎదుగుతోంది. గూగుల్, రిలయన్స్, మెటా వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు భారీ పెట్టుబడులతో ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించేందుకు ముందుకు రావడం విశాఖకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. గూగుల్ అమెరికా వెలుపల అతిపెద్ద పెట్టుబడిగా సుమారు 1.25 లక్షల కోట్ల రూపాయలతో ఏఐ హబ్ ఏర్పాటు చేస్తోంది. డేటా సెంటర్లు, సబ్సీ కేబుల్స్, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఇందులో భాగంగా ఉన్నాయి. సముద్ర తీర ప్రాంతం, తక్కువ ఖర్చు, అనుకూల విధానాలు విశాఖను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా మార్చాయి. దీంతో విశాఖ భవిష్యత్తులో ‘ఏఐ పట్నం’గా మారే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
విశాఖపట్నం కేవలం పెట్టుబడుల కేంద్రంగా కాకుండా సంపూర్ణ ఏఐ పర్యావరణ వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. రిలయన్స్, బ్రూక్ఫీల్డ్, డిజిటల్ రియాల్టీ భాగస్వామ్యంతో 98 వేల కోట్ల రూపాయలతో 1 గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్ క్లస్టర్ నిర్మాణం ప్రణాళికలో ఉంది. మెటా సంస్థ కూడా హైపర్స్కేల్ డేటా సెంటర్లో భాగస్వామ్యం తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 600 ఎకరాల భూమి కేటాయించడం, వేగవంతమైన అనుమతులు, విద్యుత్ విధానాలు పెట్టుబడులకు ఊతమిస్తున్నాయి. ఈ అభివృద్ధి విద్యుత్, కనెక్టివిటీ, నైపుణ్యాభివృద్ధి రంగాలను కూడా ప్రభావితం చేస్తోంది. దీంతో విశాఖపట్నం భారతదేశ ఏఐ ప్రయాణంలో కీలక కేంద్రంగా మారి ఆర్థిక రూపురేఖలను పూర్తిగా మార్చే దిశగా ముందుకు సాగుతోంది.
దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజలకు 125 రోజులు పని కల్పిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో ఏపీ వేదికగా ఈ సరికొత్త సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వీబీజీ రామ్జీ స్కీమ్ ను తిరుపతి జిల్లా ముక్కావారిపల్లె గ్రామంలో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఉమ్మడిగా ప్రారంభించారు.
సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి మొక్కలు నాటారు. అనంతరం గ్రామీణ పారిశుద్ధ్యం, నీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన స్వచ్ఛ రథాలు, మ్యాజిక్ డ్రైన్ల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. జల సంరక్షణకు సంబంధించి అధికారులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీ ని సందర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామీణ అభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చిన ఈ ‘VB-G RAM-G’ పథకం వల్ల ఉపాధి హామీ కూలీలకు భారీ లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కింద అర్హులైన కూలీలకు రోజువారీ వేతనాన్ని రూ. 312 గా ఖరారు చేశారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఉన్న పనిదినాలను 125 రోజులకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పట్ల ఉపాధి కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంతో కలిసి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేందుకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందని సీఎం చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు అమరావతికి జై కొట్టారు.. తర్వాత రూటు మార్చి మూడు రాజధానులు అన్నారు. మూడు ముక్కలాట ఆడారు. అధికారంలో ఉన్నప్పుడు విశాఖే మా ముద్దుబిడ్డ అన్నారు. ప్యాలెస్ తప్ప మూడు బిల్డింగ్లు కూడా కట్టలేదు. కట్ చేస్తే..వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఇప్పుడు సడన్గా మావిగన్ అంటున్నారు. అధికారం పోయినా, జనాలు 11 సీట్లకే పరిమితం చేసినా జగన్కు తత్వం బోధపడలేదు. ఒక చేత్తో అమరావతి రైతులపై సానుభూతి చూపిస్తూనే.. ఇంకో చేత్తో అమరావతికి వ్యతిరేకంగా మావిగన్ అజెండాతో వెళ్తామంటున్నారు. మొత్తానికి మావిగన్ స్లోగన్తోనే వచ్చే ఎన్నికల్లో తలపడతామంటున్నారు. అయితే ఓవైపు అమరావతి నిర్మాణాలు శరవేగంగా సాగుతున్న ఈ తరుణంలో.. జగన్ తెచ్చిన ఈ సరికొత్త ప్రతిపాదన అటు ప్రజల్లోనే కాదు.. ఇటు సొంత పార్టీ నేతల్లోనూ తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. వచ్చే ఎన్నికలలోపు అమరావతి రాజధానికి ఓ రూపు వచ్చేస్తుంది. ఇప్పటికే నిర్మాణ పనులు ఫ్లడ్లైట్ల వెలుగులతో జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్నాయి. మరి అన్ని పనులు పూర్తయితే ఇంకో రాజధాని అవసరం ఏముంటుంది అనేది ప్రజల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. ఇంతకీ అసలు మావిగన్ కథ ఏంటి..? జగన్ మైండ్లో ఏముంది. అధికార కూటమి ఏమంటోంది..?
2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీకి రాజధాని అంశం ఒక అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నాడు ప్రతిపక్ష నేతగా అమరావతికి జై కొట్టిన జగన్మోహన్ రెడ్డి.. 2019లో అధికారంలోకి రాగానే మాట మార్చారు. మూడు రాజధానుల ముసుగులో అమరావతిని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేశారు. ఐదేళ్ల పాటు కాలయాపన చేసి.. చివరకు ఉత్తరాంధ్రా ప్రజలు కానీ, కృష్ణా-గుంటూరు ప్రజలు కానీ జగన్ నిర్ణయాన్ని స్వాగతించలేదు. మొన్నటి ఎన్నికల్లో విద్యాధికులు, తటస్థులతో పాటు సామాన్య ప్రజలు సైతం ఓట్ల రూపంలో వైసీపీకి గట్టి బుద్ధి చెప్పారు. అయినా సరే జగన్ గతాన్ని మర్చిపోయినట్టు కనిపిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు పేరును తెరపైకి తెచ్చారు. వచ్చే ఎన్నికల్లో అమరావతి వర్సెస్ మావిగన్ అనే ఎజెండాతోనే ప్రజల్లోకి వెళ్తామని ప్రకటించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతిని నిర్వీర్యం చేస్తాం అని జగన్ చెప్పకనే చెప్పారంటున్నారు టీడీపీ నేతలు. ఎన్ని భవనాలు కట్టినా నేలమట్టం చేసి.. మావిగన్ ను అభివృద్ధి చేస్తాం అన్నది జగన్ మాట. మరి రాజధానికి వేలకు వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతుల మాట ఏంటి? 50 వేల కోట్ల రూపాయల రుణం మాట ఏంటి? అంటే తెలియని పరిస్థితి. దాదాపు 15 సంవత్సరాల పాటు రాష్ట్రానికి రాజధాని లేకుండా ఉండడం అంటే దాని వెనుక జగన్ వైఫల్యమే కనిపిస్తోందని.. ఆయన ప్రజల్లో ఒక రకమైన విభజన రేఖ తేవాలని ప్రయత్నిస్తున్నట్టు ఉందని టీడీపీ నేతలు అంటున్నారు.
అమరావతిని వ్యతిరేకించినందుకే ఆ పార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైందని అన్నారు సీఎం చంద్రబాబు. జగన్ పాలనలో రాజధాని రైతులపై దాడులు జరిగాయని, కుల, మత, ప్రాంతీయ రాజకీయాలతో ప్రజలను విడదీయాలని ప్రయత్నించారని ఆరోపించారు. రాజధానికి చట్టపరమైన రక్షణ కల్పించేందుకు కేంద్ర సహకారంతో చర్యలు తీసుకున్నామని, అయినప్పటికీ జగన్ అమరావతిని అంగీకరించడం లేదని విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసం జగన్ తెరపైకి తెచ్చిన ఈ మావిగన్ అనే సరికొత్త వ్యూహం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏమిటో ఆయన ప్రజలకు స్పష్టం చేయాల్సి ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలు దశాబ్దాలుగా ఉన్నవే. పైగా కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న అమరావతి సైతం భౌగోళికంగా ఈ విజయవాడ-గుంటూరు పరిధిలోనే ఉంది. అలాంటప్పుడు అమరావతికి భిన్నంగా జగన్ ప్రతిపాదిస్తున్న మావిగన్ ప్లాన్ ఏంటో, దాని స్వరూప స్వభావాలు ఏమిటో కనీస రోడ్ మ్యాప్ లేకుండా కేవలం నినాదాలకే పరిమితం చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
ఏదైనా ప్రతికూల అంశాలు ఫలితాలపై ప్రభావం చూపినప్పుడు వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ ఈ విషయంలో జగన్ వెనుక పడ్డారనే టాక్ వినిపిస్తోంది. అమరావతిని వ్యతిరేకించడం వల్ల గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వైసీపీ రాజకీయంగా భారీగా నష్టపోయింది. విద్యాధికులు, తటస్థులు ఓట్ల రూపంలో తమ తీర్పును స్పష్టంగా ఇచ్చారు. అయినప్పటికీ జగన్ తన పంథా మార్చుకోకపోవడం గమనార్హం. ఇప్పుడు ఆయన కొత్తగా జపిస్తున్న మావిగన్ మంత్రానికి అటు విజయవాడ, గుంటూరు ప్రజల నుంచి కానీ, ఇటు మచిలీపట్నం నుంచి కానీ కనీస స్పందన కరువైంది. ఒకవైపు అమరావతిలో శాశ్వత నిర్మాణాలు శరవేగంగా సాగుతుంటే.. ఈ తరుణంలో అమరావతి కావాలా? మావిగన్ కావాలా? అంటూ ప్రజలను ప్రశ్నించడం ఆయనలోని రాజకీయ విధ్వంసక ఆలోచనను బయటపెడుతోందనే విమర్శలు వస్తున్నాయి.
మరోవైపు రాజధాని విషయంలో వైసీపీ అధినేత ఒకసారి అమరావతి, మరోసారి మూడు రాజధానులు, ఇప్పుడు సడన్గా మావిగన్ అంటూ పదే పదే మాట మారుస్తుంటే.. రేపు జనాల్లోకి వెళ్తే తమ పరిస్థితి ఏంటని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు భయపడుతున్నారు. మొన్నటికి మొన్న అమరావతి రైతులకు మద్దతుగా పరామర్శకు వెళ్లిన వైసీపీ నేతలకు స్థానికంగా తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా సరే, అధినేత ఏం చెప్పినా దానికి తలూపడం మినహా మరో ప్రత్యామ్నాయం లేక.. వచ్చే ఎన్నికల నాటికి వీరంతా మావిగన్ స్లోగన్తో ప్రచారానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి అమరావతి రాజధాని విషయంలో వైసీపీపై వ్యతిరేకముద్ర పడిందని.. ముఖ్యంగా విద్యాధికులతో పాటు న్యూట్రల్గా ఉండే వాళ్లు కూడా దీనిని తప్పుపడుతూ ఓట్ల రూపంలో తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారట. అయినా ఎందుకో జగన్ వైఖరిలో మార్పు రాకపోవడాన్ని ఎక్కువమంది తప్పు పడుతున్నారట.




Total views : 199315