స్వర్ణకుప్పం విజన్–2029 రూపకల్పనపై సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పంలోని తన క్యాంప్ కార్యాలయంలో సుర్బానా జురాంగ్, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు.ఈ సమావేశంలో కుప్పం నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు, మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసే అంశాలపై విస్తృతంగా చర్చించారు. స్వర్ణకుప్పం విజన్–2029 కోసం రూపొందించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను సుర్బానా జురాంగ్ ప్రతినిధులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.వ్యవసాయం, పర్యాటక రంగాల అభివృద్ధికి చేపట్టాల్సిన కొత్త కార్యక్రమాలు, అమలు చేయాల్సిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కుప్పం భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, ఉద్యానవన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు, పశుసంపద, ప్రజల జీవన విధానం, ఆదాయ వనరుల గురించి సీఎం వివరించారు.
కుప్పం అభివృద్ధికి అన్ని రంగాలను కలుపుకొని సమగ్ర విజన్ ప్లాన్ రూపొందించాలని సూచించిన సీఎం, కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకుని ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన చర్యలను ప్రతిపాదించాలని కోరారు.యువత మరియు స్థానిక ప్రజల్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల సృష్టి, అందుబాటులో ఉన్న వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు సూచించారు.
కుప్పానికి ఉన్న సహజ, భౌగోళిక, ఆర్థిక అనుకూలతలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే విధంగా ప్రణాళిక రూపొందించాలని, ప్రశాంతమైన మరియు ఆహ్లాదకరమైన జీవనానికి అనువైన ప్రాంతంగా కుప్పాన్ని అభివృద్ధి చేయడానికి తగిన ప్రాజెక్టులను రూపొందించాలని సీఎం సూచించారు.అలాగే, కుప్పంలో పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రాంతాన్ని తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని SJ, ఐఐటీ కాన్పూర్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.




Total views : 194110