ఆసియాలోని రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాలైన భారత్, జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక అడుగు వేశాయి.రాబోయే పదేళ్లలో భారత్లో జపాన్ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. జపాన్ నుంచి 10 బిలియన్ డాలర్లకు పైగా కొత్త పెట్టుబడులు, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలతో మౌలిక సదుపాయాలు, హైటెక్ తయారీ, AI, మొబిలిటీ, పరిశ్రమల అభివృద్ధికి ఊతం లభిస్తుందని తెలిపారు. దీంతో “మేక్ ఇన్ ఇండియా”, “డిజిటల్ ఇండియా” కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
న్యూఢిల్లీలో జరిగిన 16వ భారత్–జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే తకాయిచి సమక్షంలో పలు కీలక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఫార్మా, రక్షణ, తీరప్రాంత భద్రత, కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, ఆర్థిక భద్రత, ఇంధన రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేలా ఈ ఒప్పందాలు రూపుదిద్దుకున్నాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సరఫరా గొలుసుల భద్రత, సాంకేతిక స్వావలంబన లక్ష్యంగా ఇరు దేశాలు కొత్త రోడ్మ్యాప్ను ప్రకటించాయి.అంతేకాదు.. AI రంగంలో సంయుక్త పరిశోధనలు, లార్జ్ లాంగ్వేజ్ మోడళ్ల అభివృద్ధి, స్టార్టప్లకు మద్దతు, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఫార్మా రంగంలో ఔషధ పరిశోధన, వైద్య సాంకేతికత, బయోఫార్మా సరఫరా గొలుసు బలోపేతంపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి. రక్షణ రంగంలో తొలి సంయుక్త అభివృద్ధి ఒప్పందం, తీరప్రాంత భద్రతలో నౌకాదళం–కోస్ట్ గార్డ్ సమన్వయాన్ని పెంచే చర్యలు కూడా ఈ సమావేశంలో ఖరారయ్యాయి.
ప్రపంచ భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు వేగంగా మారుతున్న వేళ… భారత్–జపాన్ భాగస్వామ్యం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకే పరిమితం కాకుండా… ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, సాంకేతిక ఆవిష్కరణలు, ఆర్థిక స్థిరత్వానికి కొత్త దిశానిర్దేశం చేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా AI, సెమీకండక్టర్లు, డిఫెన్స్, క్రిటికల్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఈ ఒప్పందాలు ఇరు దేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లనున్నాయి. కాగా..ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో భద్రత, ఆర్థిక సహకారం, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా AI, సెమీకండక్టర్లు, డిఫెన్స్, క్రిటికల్ మినరల్స్, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఈ భాగస్వామ్యం భారత్–జపాన్ సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని భావిస్తున్నారు. అదేవిధంగా భారత్–జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం మరో కీలక మైలురాయిని చేరుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిరేపుతోంది.