ప్రపంచ రక్షణ రంగంలో వ్యూహాత్మక సమీకరణాలను పూర్తిగా మార్చే సంచలన పరిణామం వెలుగులోకి వచ్చింది. రష్యా తన అత్యంత అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్గా పేరుగాంచిన S-500ను పూర్తి సాంకేతిక బదిలీతో భారత్లోనే తయారు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు అంతర్జాతీయ రక్షణ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు రష్యా అత్యంత గోప్యంగా భావించిన ఈ సాంకేతికతను ఇతర దేశాలకు అందించడంలో ఎప్పుడూ జాగ్రత్తగా వ్యవహరిస్తుంది . ఈ నేపథ్యంలో భారత్కు ఈ స్థాయి యాక్సెస్ ఇవ్వాలనుకోవడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ వద్ద ఉన్న S-400 వ్యవస్థ దేశ వైమానిక రక్షణకు బలమైన కవచంలా నిలుస్తుండగా, S-500 చేరితే అది మరింత శక్తివంతమైన మల్టీ లేయర్ డిఫెన్స్గా మారనుంది. హైపర్సోనిక్ క్షిపణులు, బాలిస్టిక్ మిస్సైల్స్, స్టెల్త్ ఫైటర్ జెట్లు, అంతరిక్ష ముప్పులను కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది . ఈ వ్యవస్థ ఆసియా రక్షణ రంగ సమీకరణాలను ప్రభావితం చేసే స్థాయిలో ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
()S-500 కేవలం మరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కాదు.. భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన అత్యాధునిక రక్షణ కవచం. దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను గుర్తించి, గగనతలంలోనే ధ్వంసం చేయగల సామర్థ్యం దీనికి ఉందని రష్యా వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా హైపర్సోనిక్ ఆయుధాలు, అంతరిక్షం నుంచి వచ్చే ముప్పులను అడ్డుకునే శక్తి దీనికి ఉండటం వల్ల ప్రపంచ దేశాల దృష్టి ఈ వ్యవస్థపై పడింది. ప్రస్తుతం చైనా తన సైనిక శక్తిని వేగంగా పెంచుకుంటుండగా, పాకిస్తాన్ కూడా క్షిపణి సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో భారత్కు S-500 అందుబాటులోకి వస్తే అది దక్షిణాసియాలో ఆయుధ శక్తి సమతౌల్యాన్ని పూర్తిగా మార్చేస్తుందని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్ ఇప్పటికే స్వదేశీ ఆకాశ్తీర్ నెట్వర్క్తో పాటు S-400ను వినియోగిస్తూ గగనతల రక్షణను బలోపేతం చేస్తోంది. దీనికి S-500 జతకలిస్తే భారత్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ కలిగిన దేశాలలో ఒకటిగా ఎదిగే అవకాశముంది.
()అయితే ఈ డీల్ వెనుక కేవలం రక్షణ అవసరాలే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రష్యా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ప్రపంచ ఆయుధ మార్కెట్లో తన ప్రభావాన్ని కొనసాగించాలంటే భారత్ వంటి భారీ మార్కెట్తో కలిసి పనిచేయడం అవసరమని మాస్కో భావిస్తోంది. అందుకే పూర్తి టెక్నాలజీ ట్రాన్స్ఫర్, భారత్లో తయారీ, భవిష్యత్లో ఎగుమతుల అవకాశాల వంటి ఆఫర్లతో ముందుకు వస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . కానీ మరోవైపు అమెరికా ‘CAATSA’ ఆంక్షల చట్టం ఈ ఒప్పందంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గతంలో భారత్ S-400 కొనుగోలు చేసినప్పుడు అమెరికా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఇండో-పసిఫిక్ వ్యూహంలో భాగంగా భారత్ కీలక భాగస్వామి కావడంతో మినహాయింపు ఇచ్చింది. చైనాను కట్టడి చేయడానికి భారత్ కు ఈ తరహా రక్షణ వ్యవస్థ అవసరమని భావించింది . ఇప్పుడు S-500 డీల్ ముందుకు వెళితే వాషింగ్టన్ ఎలా స్పందిస్తుందో అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. భారత్ మాత్రం తన జాతీయ భద్రతే ప్రాధాన్యమని స్పష్టం చేస్తూ వ్యూహాత్మక సమతౌల్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తోంది.చూడాలి మరి ఏమి జరుగుతుందో .





Total views : 81013