తెలంగాణ రాష్ట్రంలో చెరువుల ఆక్రమణలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో వార్తల్లో నిలిచిన హైడ్రా చర్యలపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ను ధిక్కరిస్తూ హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టడంపై న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ పరిధిలోని ఒక స్థలానికి సంబంధించి హైకోర్టు గతంలోనే యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఆ ఆదేశాలను పక్కనబెట్టి, సదరు స్థలం పార్కుకు చెందిందంటూ హైడ్రా అధికారులు అక్కడ ఉన్న నిర్మాణాలను కూల్చివేసి బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా ఏకపక్ష చర్యలను సవాలు చేస్తూ బాధితులు హైకోర్టులో అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలు అమల్లో ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. హైడ్రా తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఇచ్చిన స్టే ఆర్డర్ను ధిక్కరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. చట్టాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వ విభాగాలు ఈ విధంగా వ్యవహరించడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో సమాధానం చెప్పాలని అధికారులను ఆదేశించింది.
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి.
12
previous post





Total views : 212440