ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రూ.8.80 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. జల్జీవన్ మిషన్ విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 2028 డిసెంబర్ వరకు జల్జీవన్ మిషన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని మదురై ఎయిర్పోర్టును అంతర్జాతీయ ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దాంతో పాటు కేబినెట్ భేటీలో ప్రధానంగా మధ్య ప్రాచ్యంలో యుద్ధం ప్రభావం భారత్పై ఎంత మేరకు పడుతుందన్న దానిపై చర్చించారు. తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలను గురించి కూడా చర్చించారు.
ముఖ్యంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది. కేబినెట్ సమావేశంలో తమిళనాడు అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, పారిశ్రామికాభివృద్ధి మరియు సంక్షేమ పథకాల అమలుపై కేంద్రం వరాల జల్లు కురిపించినట్లు తెలుస్తోంది. తమిళనాడులో అడ్వాంటేజ్ పొందేందుకు కేంద్రం ఒకవైపు అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే, మరోవైపు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చేరువయ్యేలా నిర్ణయాలు తీసుకుంటోంది. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు, పీఎం ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల పంపిణీ ద్వారా ప్రజల్లోకి వెళ్లాలని కేంద్రం భావిస్తోంది. మార్చి 11న ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అధికారిక ప్రకటనలు మరియు ప్రారంభోత్సవాలు ఉండనున్నాయి.



Total views : 47751