ఆర్థిక లావాదేవీల్లో నిత్యం ఉపయోగించే PAN కార్డుకు సంబంధించి కేంద్రం కొన్ని మార్పులు చేపట్టింది. లావాదేవీ పరిమితులను గణనీయంగా పెంచింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను నోటిఫై చేసింది. ఇందులో భాగంగా పాన్కు సంబంధించిన లావాదేవీ పరిమితులను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ఒకేసారి లేదా విడతల వారీగా జమ చేసినా, ఉపసంహరించుకున్నా పాన్ వివరాలు ఇకపై ఇవ్వాల్సి ఉంటుంది. ఒకటే బ్యాంకు లేదా వేర్వేరు బ్యాంకుల్లో జరిగినా ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రస్తుతం ఒక రోజులో రూ.50 వేలు దాటితేనే పాన్ అడుగుతున్నారు.
ఇళ్లు, స్థలాల కొనుగోలు, అమ్మకం, బహుమతి లేదా ఉమ్మడి డెవలప్మెంట్ ఒప్పందాల విషయంలో లావాదేవీ విలువ రూ.20లక్షలు దాటితే ఇకపై పాన్ తప్పనిసరి. ప్రస్తుతం ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. స్థిరాస్తి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితిని రెట్టింపు చేయడం గమనార్హం. ద్విచక్ర వాహనం సహా ఏ మోటారు వాహనమైనా, దాని ధర రూ.5 లక్షలు మించితే కొనుగోలుదారుడు పాన్ సమర్పించాల్సి ఉంటుంది. పాత చట్టంలో ద్విచక్ర వాహనాలకు ఈ నిబంధన లేదు. కార్లకు, ఇతర మోటారు వాహనాలకు ధరతో సంబంధం లేకుండా పాన్ సమర్పించాల్సి వచ్చేది. కొత్తగా రూ.5 లక్షల పరిమితిని తీసుకొచ్చారు. హోటళ్లు లేదా రెస్టారెంట్ల బిల్లులు, కన్వెన్షన్ సెంటర్లు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలకు చేసే చెల్లింపులు రూ.లక్ష దాటితే ఇకపై పాన్ సమర్పించాలి. ప్రస్తుతం హోటల్, రెస్టారంట్ బిల్లు రూ.50 వేలు దాటితే పాన్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ మొత్తాన్ని రెట్టింపు చేశారు. ప్రస్తుతం బీమా పాలసీ కొనుగోలు సమయంలో వార్షిక ప్రీమియం రూ.50వేలు దాటితేనే పాన్ అడుగుతున్నారు. ఇకపై ప్రతి పాలసీకి పాన్ సమర్పించడం తప్పనిసరి.




Total views : 56904