టీడీపీ- జనసేన పొత్తుపై పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. మండపేటలో చంద్రబాబు టీడీపీ అభ్యర్థిని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. పొత్తు ధర్మం ప్రకారం ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించకూడదన్నారు. టీడీపీకి బలం ఇచ్చేవాళ్లం అవుతున్నాం కానీ తీసుకునే వాళ్లం కాలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు వ్యక్తులను కలపడం కష్టం కానీ విడదీయం తేలికని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ఒంటరిగా పోటీ చేస్తే కొన్ని స్థానాలు వస్తాయి. కానీ అధికారంలోకి వస్తామో లేదో తెలియదన్నారు. అందుకే తెలుగుదేశం పార్టీకి పోటీగా జనసేన కూడా అభ్యర్థులను ప్రకటిస్తోందని స్పష్టం చేశారు. టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి తాము కూడా రాజోలు, రాజానగరంలో పోటీ చేస్తున్నట్లు జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. చంద్రబాబు లాగే నాకు ఒత్తిడి ఉందని, అందుకే రెండు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. టీడీపీలో పొత్తులో భాగంగా మూడో వంతు సీట్లు తీసుకుంటున్నామని పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారు. లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా తాను పట్టించుకోలేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసం మౌనంగా ఉన్నానని జనసేనాని తెలిపారు.