ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పలు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. 19 యూనివర్సిటీలు, RGUKT యూనివర్సిటీల్లో మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు 1,020, అసోసియేట్ ప్రొఫెసర్లు 334, ప్రొఫెసర్లు 63, లెక్చరర్లు 104 పోస్టులు, అలాగే 279 బ్యాక్లాగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎన్నికల మేనిఫెస్టో, జాబ్ క్యాలెండర్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మంత్రి లోకేష్. రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి, నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ భారీ భర్తీ ప్రక్రియను చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ నోటిఫికేషన్లో మొత్తం 1,523 పోస్టులను భర్తీ చేయనుండగా, అందులో 1,020 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 334 అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 63 ప్రొఫెసర్ పోస్టులు మరియు 104 లెక్చరర్ పోస్టులు ఉన్నాయని మంత్రి వివరించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి ఆన్లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని స్పష్టం చేశారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఈ నియామకాలను పూర్తి చేయడం ద్వారా విశ్వవిద్యాలయాల్లో బోధన సామర్థ్యం పెరుగుతుందని, తద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన బోధన అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నియామక ప్రక్రియలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈ అడుగు వేసినట్లు లోకేశ్ తన ట్వీట్లో పేర్కొన్నారు. పారదర్శకమైన పద్ధతిలో, ఎటువంటి అవకతవకలకు తావులేకుండా ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని, ఇది రాష్ట్ర విద్యా రంగ చరిత్రలో ఒక చరిత్రాత్మక ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఇప్పటికే ఉన్నత విద్యా మండలి ఈ పోస్టుల భర్తీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.





Total views : 76928