హైదరాబాద్ జూబ్లీహిల్స్లో రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ భార్య హత్య, దోపిడీ కేసు ఛేదించారు పోలీసులు. ఈ కేసులో ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ రంజన్ ఇంట్లో నేపాలీ పనిమనిషి కల్పన..ఎంతో నమ్మకంగా ఉంటూ యజమానురాలి హత్యకు ప్లాన్ చేసింది. ప్రియుడు వికాస్ పన్నిన పథకం ప్రకారం..దారుణానికి పాల్పడింది. కల్పన, ఆమె ప్రియుడు వికాస్ ఈ ఘోరానికి ప్రధాన సూత్రధారులుగా తేల్చారు పోలీసులు.
కల్పనకు నేపాల్కే చెందిన వికాస్ అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉంది. వినయ్రంజన్ ఇంట్లో భారీగా నగదు, బంగారు ఆభరణాలు ఉన్నాయని గమనించిన కల్పన, ఆ విషయాన్ని తన ప్రియుడు వికాస్కు చేరవేసింది. ఎలాగైనా ఆ ఇంట్లో పెద్ద ఎత్తున చోరీ చేయాలని వీరిద్దరూ కొద్దిరోజుల క్రితమే పక్కా స్కెచ్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం వికాస్ ఓ ముఠాను రంగంలోకి దించాడు. మాజీ ఐపీఎస్ అధికారి వినయ్రంజన్ ఇంట్లో లేని సమయం చూసి కల్పన..వెంటనే తన ప్రియుడు వికాస్కు సమాచారం ఇచ్చింది. దీంతో ఈ నెల 7న ఇద్దరు నిందితులు ఆ ఇంటి పరిసరాల్లో తిరుగుతూ ‘రెక్కీ’ నిర్వహించారు. ఇల్లు దోపిడీకి అత్యంత అనుకూలంగా ఉందని వారు గ్యాంగ్ లీడర్ వికాస్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ నెల 9న అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ముగ్గురు నిందితులు ఇంట్లోకి చొరబడ్డారు. మరో నలుగురు సభ్యులు ఇంటి బయట కాపలాగా ఉన్నారు.
ఇక ఇంట్లో ఒంటరిగా ఉన్న వినయ్రంజన్ భార్య వారిని గమనించి కేకలు వేయడానికి ప్రయత్నించడంతో భయాందోళనకు గురైన నిందితులు ఆమెను గట్టిగా పట్టుకుని, గొంతు నొక్కేశారు. అనంతరం ఆమె చేతులను వెనక్కి విరిచి కట్టేసి, కదలకుండా చేసి ఊపిరి ఆడకుండా దారుణంగా హతమార్చారు. ఆమె మృతి చెందిందని నిర్ధారించుకున్నాక, ఆమె మెడలోని మంగళసూత్రం, చేతి వేలి ఉంగరాలను తెంచేసుకున్నారు. ఆపై బెడ్రూమ్లోని బీరువాలను పగులగొట్టి అందులోని 23 తులాల బంగారంతో నిందితులు పరారయ్యారు. నేరుగా నాంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకొని తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కి కాజీపేట వరకు వెళ్లారు. అక్కడ రైలు దిగి, దోచుకున్న 23 తులాల బంగారాన్ని అందరూ సమానంగా పంచుకున్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మూడు వేర్వేరు బృందాలుగా విడిపోయి ముంబైకి పారిపోయారు. అక్కడ తన వాటాను ఓ వ్యాపారికి అమ్మేశాడు ఓ నిందితుడు.
అయితే, సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో నిందితుల కదలికలను ట్రాక్ చేసిన జూబ్లీహిల్స్ ప్రత్యేక పోలీస్ బృందం ముంబైలో మెరుపు దాడి చేసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రధారి వికాస్, పనిమనిషి కల్పనతో పాటు పరారీలో ఉన్న మిగిలిన నేపాలీ నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.




Total views : 90034