పాకిస్తాన్లో ఘోర ప్రమాదం జరిగింది. పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ కుప్పకూలింది. మర్దాన్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు యువ పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సావల్ధేర్ కాట్లాంగ్ రోడ్డు సమీపంలో జరిగింది ఈ ఘటన. సాధారణ శిక్షణ రౌండ్లో భాగంగా టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహ్మద్ ఖాసిం అబ్దుల్లా, తాహా అబ్బాసిగా ఆర్మీ ధ్రువీకరించింది. వీరు ఇద్దరూ విధి నిర్వహణలోనే వీరమరణం పొందారని ఐఎస్పీఆర్ పేర్కొంది.
ఐతే విమానం నియంత్రణ కోల్పోతున్న సమయంలో పైలట్లు ఇద్దరూ అత్యంత సాహసోపేతంగా వ్యవహరించారు. విమానం ఇళ్లపై పడకుండా అప్రమత్తంగా వ్యవహరించారు. ఇళ్లపై పడి ఉంటే భారీగా ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానిక అధికారులు తెలిపారు. పైలట్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి విమానాన్ని నివాస ప్రాంతాలకు దూరంగా ఉన్న ఖాళీ రోడ్డు పక్కన ల్యాండ్ చేయడానికి ప్రయత్నించారని వెల్లడించారు. అయితే వేగంగా వచ్చి భూమిని ఢీకొట్టడంతో విమానం ముక్కలైంది. విమాన శిథిలాలు ఎగిరిపడటంతో రోడ్డుపై వెళ్తున్న ముగ్గురు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విమానం కూలిపోవడానికి గల అసలు కారణాలపై దర్యాప్తుకు ఎయిర్ హెడ్క్వార్టర్స్ ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కొద్ది రోజుల క్రితమే పాక్ ఆక్రమిత కశ్మీర్లో సైనిక హెలికాప్టర్ కూలి పలువురు సైనికులు మరణించిన ఘటన మరువక ముందే.. ఇప్పుడు మళ్లీ మరో శిక్షణ విమానం కూలిపోవడం పాక్ రక్షణ రంగంలో ఆందోళన కలిగిస్తోంది.





Total views : 146907