నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రామ్’పై కేంద్రం నిషేధం విధించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. కేంద్రం చర్య దొంగను పట్టుకోవడానికి బదులుగా.. బాధితుడి ఇంటి తలుపునకు తాళం వేయడంలా ఉందంటూ ఎద్దేవా చేశారు. నోట్స్, టెస్ట్ సిరీస్లు, చర్చలు, ప్రిపరేషన్ కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎప్పటినుంచో టెలిగ్రామ్ ను ఉపయోగిస్తున్నారని.. దీనిపై నిషేధం విధించడం వల్ల వారు నష్టపోయే ప్రమాదముందని పేర్కొన్నారు. అసలు ఈ ఆలోచన పేపర్ లీక్లు అరికట్టడానికి ఎలా ఉపయోగపడుతుందని ప్రశ్నించారు. నిందితులు టెలిగ్రామ్ కాకుంటే వాట్సప్లోనూ పేపర్లు లీక్ చేస్తారని అన్నారు. అలా అని వాట్సప్ను కూడా బ్యాన్ చేస్తారా? అంటూ ప్రశ్నించారు.
ఈ నిషేధం తీరు పరీక్షల్లో మోసాలకు పాల్పడే పేపర్ లీక్ నెట్వర్క్లను కాకుండా, విద్యార్థులనే లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఉందని రాహుల్ ఆక్షేపించారు. నీట్ అభ్యర్థులకు జరిగిన అన్యాయం నుంచి దృష్టి మరల్చడానికే కేంద్రం ఈ ఎత్తుగడ వేసిందని విమర్శించారు. దేశంలో పదేపదే పేపర్ లీక్లకు పాల్పడుతున్న నిందితులపై చర్యలు తీసుకోవడంలో మోదీ యంత్రాంగం విఫలమైందన్నారు. ప్రభుత్వ కనుసన్నల్లోనే పేపర్ లీక్ మాఫియా నడుస్తోందని.. దానిని కప్పిపుచ్చుకొనేందుకే పరీక్ష కేంద్రాల వద్ద భద్రతా బలగాలను మోహరించడం, ప్రశ్నపత్రాలను వైమానిక దళం ద్వారా పంపించడం వంటి నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మాట వినకపోతే తమ హక్కులను ఎలా సాధించుకోవాలో యువతకు తెలుసని అన్నారు.




Total views : 146856