వెనెజువెలాలో సంభవించిన జంట భూకంపాలు.. ఆ దేశంలో తీరని విషాదాన్ని నింపాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసిన బృందాలు… క్షతగాత్రులను వెలికితీసే పనిలో నిమగ్నమయ్యాయి. మృతుల సంఖ్య 600 కు చేరింది. గాయపడిన వారి సంఖ్య 3 వేలు దాటింది. భూకంపం ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న లా గువైరా రాష్ట్రంలో భారీగా సహాయక బృందాలను మోహరించారు. పగలు రాత్రి తేడా లేకుండా సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద ఇప్పటికీ వందలాది మంది చిక్కుకుపోయినట్లు ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేయగా… అందులో దాదాపు 50 వేల మంది పేర్లు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రకృతి విలయంలో తీవ్రంగా నష్టపోయిన వెనెజువెలాకు ఆపన్న హస్తం అందించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు వచ్చాయి. అనేక విదేశీ బృందాలు ఇప్పటికే రాజధాని కారకాస్ చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. భారత్ సైతం వెనెజువెలాకు భారీగా సహాయం ప్రకటించింది. ఔషధాలు, వైద్య పరికరాలతో కూడిన ప్రత్యేక సైనిక బృందాన్ని ఆ దేశానికి పంపింది. అవసరమైతే మరింత సాయానికి కూడా సిద్ధమంటూ ప్రకటించింది. అటు ఐక్యరాజ్య సమితి కూడా అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తోంది. అందరూ అందిస్తున్న చేయూతతో త్వరలోనే దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని… వెనెజువెలా ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.





Total views : 180170