ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల వివరాల పరిశీలన, మ్యాపింగ్, సవరణ పనులను ఎన్నికల అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తుండగా, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల సవరణలు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి, ఖచ్చితమైన ఓటర్ల జాబితా రూపొందించడంపై అధికారులు దృష్టి సారించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటరు జాబితా పునాది కావడంతో, ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వం, ఎన్నికల యంత్రాంగం సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి..
ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జీలు, బీఎల్ఏలతో మంత్రి అచ్చెన్నాయుడు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఓటరుగా నమోదు కావడం ప్రతి పౌరుడి బాధ్యత..అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని పిలుపు ఇచ్చారు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకుని ..ప్రస్తుత ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి మ్యాపింగ్ చేయాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు 86 శాతం ఓటర్ల మ్యాపింగ్ పూర్తి కావడం సంతోషకరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మ్యాపింగ్ ప్రక్రియలో అధికారుల నిర్లక్ష్యం లేదా లోపాలు గమనిస్తే… వెంటనే పార్టీ నాయకుల దృష్టికి తీసుకురావాలని ఓటర్లకు మంత్రి సూచించారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రతీ బుధవారం బూత్, క్లస్టర్ ఇన్చార్జీలు, మండల నాయకులు తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్న మంత్రి..కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయాలు, సంక్షేమ కార్యక్రమాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చారు.





Total views : 180158