భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. పనులను వేగవంతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలో పర్యటించిన మంత్రి పొంగులేటి ..భద్రాద్రి శ్రీ సీతారామచంద్రులను దర్శించుకొని, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి తొలి విడతగా రూ.351 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు మంత్రి తెలిపారు. గత శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పనులకు శంకుస్థాపన జరిగిన విషయాన్ని గుర్తుచేశారు.
ప్రధాన ఆలయానికి ఎలాంటి ఆటంకం కలగకుండా శాస్త్రోక్తంగా అభివృద్ధి పనులు చేపడతామని చెప్పారు మంత్రి. ఇందులో భాగంగా ఇన్నర్, ఔటర్ ప్రాకారాల అభివృద్ధి, మాడ వీధుల ఆధునీకరణ, నాలుగు వైపులా నూతన గోపురాల నిర్మాణం, పెండింగ్లో ఉన్న గోపుర పనులను పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఆలయం నుంచి గోదావరి నది వరకు విశాలమైన రోడ్లతో పాటు.. రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త స్నాన ఘాట్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గత పాలకుల మాదిరిగా మాటలకే పరిమితం కాకుండా దృఢ సంకల్పంతో ఈ పనులు చేపడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి. శ్రీరాముని ఆశీస్సులతో రాబోయే గోదావరి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామనే విశ్వాసం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్లో ఉన్న అడ్డంకులను తొలగించి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.




Total views : 221447