చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం ప్రస్తుతం ఆధ్యాత్మిక శోభతో పులకించిపోతోంది. ప్రసిద్ధ శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర గత నాలుగు రోజులుగా అంగరంగ వైభవంగా సాగుతోంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, విభిన్న కళా సాంస్కృతిక కార్యక్రమాలు, మనోహరమైన పాటకచేరీలతో కుప్పం వీధులన్నీ పండగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా, పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు కుప్పానికి భారీగా తరలివస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ సైతం జాతర జరిగే ఎనిమిది రోజుల పాటు అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను కుప్పం స్టేషన్లో నిలపాలని నిర్ణయించింది. ఇక జాతరలో అత్యంత కీలక ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది. ఇవాళ గంగమ్మ అమ్మవారి విశ్వరూప దర్శన మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా హాజరుకానున్నారు. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు, సారె సమర్పించనున్నారు.
Devotional
రఘునాథ స్వామి ఆలయ భూములపై అక్రమాలు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి… ఇది సాధారణ గ్రామం కాదు. త్రేతాయుగంలో శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి వనవాసం చేసిన పవిత్ర భూమిగా భక్తులు విశ్వసించే ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ కొలువుదీరిన సీతా లక్ష్మణ సమేత శ్రీ రఘునాథ స్వామి ఆలయం ఎన్నో శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. సీతమ్మ దాహం తీర్చేందుకు శ్రీరాముడు బాణం సంధించి పాతాళ గంగను వెలికితీశాడని స్థానిక పురాణం చెబుతోంది. ఆలయం ఎదుట ఉన్న బావిలో ఇప్పటికీ ఆ బాణం గుర్తులు కనిపిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే సీతమ్మ నార చీరలు ఆరవేసినట్లు చెప్పబడే దోనబండ, రాముడి పాదముద్రలు వంటి ఎన్నో పురాణ చిహ్నాలు ఈ క్షేత్రంలో మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి . కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఈ ఆలయానికి రాజులు వేల ఎకరాల భూములను దానంగా ఇచ్చారు. కానీ నేడు అదే దేవాదాయ భూములు అక్రమాల అడ్డాగా మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. భక్తి, చరిత్ర, రాజకీయాలు కలిసిపోయిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
శ్రీ రఘునాథ స్వామి ఆలయానికి ఒకప్పుడు రాజులు దానంగా ఇచ్చిన 3,355 ఎకరాల భూములు ఇప్పుడు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. అందులో దాదాపు 2,800 ఎకరాల సాగుభూమి ప్రస్తుతం రైతుల ఆధీనంలో ఉంది. ఈ భూముల్లో కోకో, ఆయిల్ ఫామ్ వంటి వాణిజ్య పంటలు పండుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరం 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు విలువ పలుకుతున్నా… ఆలయానికి మాత్రం సరైన ఆదాయం రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1990లో కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ భూములను సాగు చేస్తున్న రైతులు ఎకరాకు ఏడాదికి ఒక క్వింటా వేరుశనగ చొప్పున కౌలు చెల్లించాలి. కానీ ఆ తీర్పు అమలుకాక దశాబ్దాలు గడిచిపోయాయి. ప్రస్తుతం సుమారు 1,050 మంది రైతులు సాగు చేస్తున్న ఈ భూములపై చెల్లించాల్సిన కౌలు బకాయిలు 10 కోట్ల రూపాయలు దాటిపోయినట్లు తెలుస్తోంది. కోట్ల విలువైన దేవాదాయ ఆస్తులు ఉన్నప్పటికీ స్వామివారి ఆలయం మాత్రం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది.
దేవుడి ఆస్తులపై జరుగుతున్న అక్రమాలపై ఇప్పుడు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వ్యక్తులు కేవలం 100 రూపాయల స్టాంపు పేపర్లపై స్వామివారి భూములను విక్రయిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరికొందరు రెవెన్యూ అధికారుల సహకారంతో నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు కూడా సృష్టించుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015లో ప్రభుత్వం ఈ భూములన్నీ దేవాదాయ శాఖకే చెందినవని స్పష్టం చేస్తూ స్వామివారి పేరుతో పాసుపుస్తకాలు జారీ చేసింది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారలేదని భక్తులు అంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములు ఉన్నప్పటికీ ఆలయంలో జరిగే వార్షిక కళ్యాణం, రథోత్సవాలకు కూడా నిధుల కొరత వెంటాడుతుంది . కౌలు వసూలు చేయడానికి అధికారులు ప్రయత్నించినా రాజకీయ ఒత్తిళ్లు అడ్డంకిగా మారుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. నోటీసులు జారీ చేయడమే తప్ప భూముల రక్షణలో చర్యలు కనిపించడం లేదని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.
శ్రీ రఘునాథ స్వామి ఆలయ భూముల వ్యవహారం ఇప్పుడు కేవలం ఆస్తి వివాదం మాత్రమే కాదు… ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేవాదాయ శాఖ, రెవెన్యూ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరు సాగు చేస్తున్నారు? ఎవరి చేతుల్లోకి భూములు మారాయి? ఎంత భూమి అక్రమంగా విక్రయించబడింది? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. దీంతో ప్రభుత్వం వెంటనే సమగ్ర సర్వే నిర్వహించాలని భక్తులు, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పాతాళ గంగ, దోనబండ, రాముడి పాదముద్రలు వంటి పురాణ చిహ్నాలతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రం ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకునే పోరాటం చేస్తోంది. కోట్ల విలువైన భూములు స్వామివారికి తిరిగి దక్కాలంటే కఠిన చర్యలు తప్పనిసరి అని స్థానికులు అంటున్నారు. మరి ప్రభుత్వం స్పందించి దేవాదాయ భూములను రక్షిస్తుందా? లేక అక్రమాల వలయంలోనే ఈ పురాతన క్షేత్రం నలిగిపోతుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..
తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఈ క్రమంలోనే ఈ నెల 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట టెంపుల్ సిటీలో నిర్మించనున్న వేద పాఠశాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని భావి తరాలకు అందించాలనే సంకల్పంతో ఈ పాఠశాలను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీంతో పాటు కొండపైన భక్తుల సౌకర్యార్థం చేపట్టబోయే పలు అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ చేసి, పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
హనుమాన్ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానం భక్తజన సందోహంతో కిటకిటలాడుతోంది. రామనామ స్మరణలతో కొండగట్టు గిరులు మార్మోగుతున్నాయి. పచ్చని కొండ కాషాయ వర్ణాన్ని సంతరించుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా మాలదీక్ష భక్తులు కాలినడకన కొండపైకి చేరుకుని దీక్ష విరమణ చేశారు. తలనీలాలు సమర్పించి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్లోని గిర్ సోమనాథ్ జిల్లాలో పర్యటించారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన సోమనాథ్ ఆలయ పునఃప్రారంభానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ‘సోమనాథ్ అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. ఉత్సవాలకు హాజరయ్యే ముందు ప్రధాని మోదీ సోమనాథ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. హెలిప్యాడ్ నుంచి వీర్ హమీర్జీ సర్కిల్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర సాగిన ఈ రోడ్ షోలో వేలాది మంది ప్రజలు పాల్గొని ప్రధానికి ఘన స్వాగతం పలికారు. ప్రధాని కాన్వాయ్ వెళ్తున్న మార్గంలో ప్రజలు జెండాలు ఊపుతూ, నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ నృత్యాలతో అలరించారు. ఈ రోడ్ షోలో ప్రధాని వెంట గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కూడా ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని 11 పుణ్యక్షేత్రాల నుంచి సేకరించిన పవిత్ర జలాలతో కుంభాభిషేకం చేశారు. వేద మంత్రోచ్చారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని స్వయంగా జలాభిషేకం, ధ్వజ పూజ, మహాపూజ జరిపించారు. ఉత్సవాల సందర్భంగా హెలికాప్టర్ల ద్వారా ఆలయంపై పూల వర్షం కురిపించారు.
1951లో పునర్నిర్మించిన ఈ ఆలయాన్ని భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ చారిత్రక ఘట్టానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ అమృత్ మహోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్లో కాకతీయుల నాటి పురాతన శివాలయం కూల్చివేత వివాదంగా మారింది. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర కలిగిన శివాలయాన్ని కూల్చివేశారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అశోక్ నగర్ మట్టి కోటలో ఉన్న పురాతన శివాలయాన్ని అధికారులు కూల్చివేశారంటూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు నిర్మించిన ఈ ఆలయానికి 700 నుంచి 800 ఏళ్ల చరిత్ర ఉందని తెలిపారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో చారిత్రక సంపదను ధ్వంసం చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని ఆరోపించారు. పురావస్తు శాఖ, దేవాదాయ శాఖ అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించలేదని విమర్శించారు. కూల్చివేతకు కారణమైన కాంట్రాక్టర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని, అదే ప్రదేశంలో అదే శిల్పకళతో ఆలయాన్ని పునర్నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆలయ భూములను దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలని, జిల్లా కలెక్టర్ స్వయంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. రెండు రోజుల్లో చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
తిరుమల శ్రీవారి భక్తుల కు సత్వర దర్శనం కల్పించడమే పరమావధిగా టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్య భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జులై 15వ తేదీ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దర్శనం కోసం వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో పాటు అలిపిరి టోల్ గేట్ వద్ద వాహనాల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. తిరుమల ఆధ్యాత్మిక శోభను పెంచేలా అక్కడి వీధులకు కొత్త పేర్లు పెట్టాలని టీటీడీ బోర్డు నిర్ణయించింది.ఆధ్యాత్మిక సేవే కాకుండా కళలకు, ఉద్యోగుల సంక్షేమానికి టీటీడీ అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రముఖ సంగీత విద్వాంసురాలు శోభారాజ్ని టీటీడీ ఆస్థాన విద్వాంసురాలుగా నియమించింది. ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన బోర్డు టీటీడీ హెల్త్ స్కీమ్ పరిమితిని 5 లక్షల రూపాయలకు పెంచింది. ఇక ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోరికను సైతం నెరవేర్చింది.ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి కూడా అధికారిక ఐడీ కార్డులు, స్వామివారి దర్శనం, లడ్డూ కార్డులు మంజూరు చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఈ నిర్ణయాల ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందిలో నూతనోత్సాహం నింపడమే కాకుండా సామాన్య భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలందించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది.
టీటీడీ పాలక మండలి సమావేశంలో 82 అంశాలపై చర్చించారు. తిరుమలలోని ఆళ్వార్ కూడలి నుంచి బాలగంగమ్మ కూడలి వరకు శౌచాలయాల నిర్మాణాలకు 4.54 కోట్ల రూపాయల నిధుల మంజూరు చేయాలని నిర్ణయించింది. గోగర్భం డ్యామ్ నుంచి ఫిల్టర్ హౌస్ వరకు 6 కోట్ల రూపాయలతో పైపు లైన్లు, 44.2 కోట్ల రూపాయాల వ్యయంతో ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో ఆప్టెక్స్ సంస్థల నుంచి పట్టు వస్త్రాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జీ- స్క్వేర్ సంస్థ తితిదే పేరిట రిజిస్టర్ చేసిన 19.49 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పాలక మండలి సభ్యులు ఆమోదం తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని శ్రీవారి ఆలయంలో నూతన మండపాల నిర్మాణానికి 36.9 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయనున్నారు. పాలక మండలి తీసుకున్న ఈ సమగ్ర నిర్ణయాలు అటు భక్తుల నుంచి ఇటు సిబ్బంది నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట టెంపుల్లో స్వాతి నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకాన్ని ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా 108 కలశాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వాటిలోని పవిత్ర జలాలకు పూజలు చేశారు.పంచామృతం, సుగంధ ద్రవ్యాలతో పంచసూక్త పఠనాలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి అభిషేకం వైభవంగా జరిగింది.ఇక కొండక్రింద వైకుంఠ ద్వారం వద్ద నూతనంగా ప్రతిష్టించిన స్వామివారి పాదాల పూజలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు ఐదు రోజుల పాటు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు. యాదగిరిగుట్టలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టగా..నేడు ఉదయం 8 గంటలకు పాతగుట్ట ఆలయంలో జయంతి ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. యాదగిరిగుట్ట, పాతగుట్టతో పాటు అనుబంధ ఆలయమైన దబ్బగుంటపల్లిలోని యోగానంద నరసింహస్వామి టెంపుల్ లో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఈఓ భవాని శంకర్ తెలిపారు.
యాదగిరిగుట్టలో తిరువేంకటపతి అలంకార సేవ, నేడు కాళీయమర్దన అలంకార సేవ, 28న గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకార సేవ, 29న శ్రీరామావతార అలంకార సేవ, 30న జరిగే నృసింహ అలంకార సేవ, నృసింహ ఆవిర్భావంతో జయంతి ఉత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. జయంతి ఉత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు స్వామివారి ఆర్జిత సేవలు, నిత్య, శాశ్వత, మొక్కు కల్యాణాలు, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం పూజలను తాత్కాలికంగా రద్దు చేశారు. జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే లక్ష్మీనరసింహస్వామి హవనం..హోమం, 26న చేపట్టే లక్ష కుంకుమార్చన, 27న చేపట్టే లక్ష పుష్పార్చనలో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక టికెట్లను ఆలయ అధికారులు అందుబాటులోకి తెచ్చారు. లక్ష్మీనరసింహస్వామి హవన పూజకు రూ.2 వేలు, లక్ష కుంకుమార్చనకు రూ.2 వేలు, లక్ష పుష్పార్చనకు రూ.2 వేలుగా టికెట్ ధరను నిర్ణయించారు. ఒక్క టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు తెలిపారు.
కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్లో ప్రసిద్ధ త్రిస్సూర్ పూరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏడాది ఏప్రిల్–మే నెలల్లో వడక్కున్నథన్ ఆలయంలో జరిగే ఈ వేడుక రాష్ట్రంలోనే అతిపెద్ద సాంస్కృతిక ఉత్సవంగా గుర్తింపు పొందింది. సుమారు 36 గంటల పాటు కనులవిందుగా సాగే ఈ ఉత్సవాల్లో బంగారు ఆభరణాలతో అలంకరించిన గజరాజులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏనుగులపై నుంచి రంగురంగుల గొడుగులను వేగంగా మార్చే ప్రత్యేక కార్యక్రమం భక్తులను, పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.





Total views : 91166