రష్యాపై ఉక్రెయిన్ భీకర దాడులు కొనసాగిస్తోంది. మాస్కో దాని పరిసర ప్రాంతాలే లక్ష్యంగా వందల డ్రోన్లతో విరుచుకుపడింది. వాటిలో దాదాపు 60 డ్రోన్లను కూల్చేసినట్లు రష్యా ఎయిర్ డిఫెన్స్ అధికారులు వెల్లడించారు. దాడుల నేపథ్యంలో నగరంలోని నాలుగు విమానాశ్రయాలు మూతపడ్డాయి. క్రిమియాపై కూడా ఉక్రెయిన్ దాడులకు పాల్పడుతుండడంతో అదనపు భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ముందుజాగ్రత్త చర్యగా క్రిమియాలో ఈ రోజు జరగాల్సిన అన్ని బహిరంగ కార్యక్రమాలను అధికారులు రద్దు చేశారు. సాధ్యమైనంత వరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. ఇంధన సదుపాయాలు, చమురు శుద్ధి కేంద్రాలపై కీవ్ దాడులు చేయడంతో క్రిమియా ప్రాంతంలో ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం నెలకొంది. దీంతో నగరవ్యాప్తంగా ఉన్న పెట్రోల్ స్టేషన్లలో ప్రజలకు, ప్రభుత్వేతర సంస్థలకు ఇంధన విక్రయాలను నిలిపివేశారు.