తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటూ అరెస్టై, వరసగా 30 రోజులు నిర్బంధంలో ఉన్న ప్రజా ప్రతినిధులు ఆటోమేటిగ్గా పదవులు కోల్పోయేందుకు ఉద్దేశించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు చేపట్టే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులందరికీ వర్తించే బిల్లును గత ఆగస్టులో పార్లమెంటులో ప్రవేశపెట్టారు. దానిపై సమగ్ర పరిశీలన నిమిత్తం అపరాజితా సారంగీ నేతృత్వంలో సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని నియమించారు.
తమ అభ్యంతరాలను అధికారపక్షం సులభంగా బేఖాతరు చేస్తుందని పేర్కొంటూ కాంగ్రెస్ సహా విపక్ష ఇండియా కూటమి సభ్యులంతా జేపీసీని బహిష్కరించారు. కమిటీ ఈ నెల 17న భేటీ అయి నివేదికను ఆమోదించి, 20 నుంచి మొదలయ్యే సమావేశాల్లో పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉంది. దానిపై సభలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. పదవుల్ని కోల్పోయే ప్రధాన నిబంధనను కమిటీ అలాగే ఉంచి, రాజకీయ ప్రతీకార చర్యల కోసం ప్రతిపాదిత చట్టం దుర్వినియోగం కాకుండా చూసేందుకు కొన్ని సూచనల్ని నివేదికలో చేర్చవచ్చని తెలుస్తోంది. బెయిల్ పొందడానికి 30 రోజుల గడువు సరిపోతుందని, ఆ వ్యవధిలో కనీసం మూడుసార్లు ప్రయత్నాలు చేయవచ్చు కాబట్టి సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడం లేదని జేపీసీ గట్టిగా సమర్థిస్తోంది. నేర స్వభావం ఆధారంగా ఆంక్షలు ఉండాలనే సిఫార్సును జేపీసీ చేయవచ్చని భావిస్తున్నారు.