అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా దక్షిణ ఆసియాలో నెలకొన్న పరిస్థితులు, హార్మూజ్ జలసంధి క్లోజ్ చేయడం కారణంగా గ్యాస్ సరఫరాపై భారీ ప్రభావం పడింది. దీంతో దేశంలో కమర్షియల్ గ్యాస్ రేట్లను కంపెనీలు భారీగా పెంచాయి. తాజాగా యుద్ధ పరిస్థితులు తగ్గి సాధారణ పరిస్థితి నెలకొనడంతో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ రేట్లను సవరించింది. ఇందులో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య వ్యాపారులకు గుడ్న్యూస్ అందించింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై 183 రూపాయల మేర తగ్గించాయి.
ఈ భారీ తగ్గింపుతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ. 2,930 కి చేరింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో ఈ తగ్గింపు వర్తింపజేసినట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. అయితే, ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో సాధారణ ప్రజలకు మాత్రం నిరాశే ఎదురైంది. కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గడం వల్ల హోటళ్లు, క్యాటరింగ్ వ్యాపారులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.