తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ గడువు ముగిసింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించే ప్రక్రియ నేటితో పూర్తి కాగా, సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల అధికారులు కసరత్తు వేగవంతం చేశారు. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఇప్పటివరకు 100 శాతం డిజిటలైజేషన్ పూర్తి కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 3.38 కోట్ల మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేయగా, అధికారులు ఇప్పటివరకు 2.64 కోట్ల పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియను మాత్రమే పూర్తి చేయగలిగారు. రాష్ట్రంలో దాదాపు 69 లక్షల మంది ఓటర్లు ఇప్పటివరకు తమ వివరాలు లేదా ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులకు సమర్పించలేదు. ఇల్లు మారడం , ఊరిలో అందుబాటులో లేకపోవడం , మరణించడం లేదా నకిలీ ఓట్లు ఉండటం వల్ల ఈ స్థాయిలో ఫారాలు ఇంకా స్వీకరించలేదని తెలుస్తోంది. రాజధాని హైదరాబాద్లో ఈ ప్రక్రియ మరీ మందకొడిగా సాగుతోంది. హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ ఇప్పటివరకు 60 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే తరహాలో మందగమనం కనిపించింది. డిజిటలైజేషన్ పూర్తయిన అనంతరం ఈ నెలలోనే డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను విడుదల చేయడానికీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Tag: