అగ్రిగోల్డ్ బాధితులకు వేగంగా న్యాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలను మరింత తీవ్రతరం చేసింది. డిపాజిటర్ల సొమ్మును అక్రమంగా మళ్లించి నిలువునా ముంచిన యాజమాన్యంపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబిస్తోంది. విచారణలో భాగంగా సీఐడీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రజల డబ్బుతో బంధువుల పేరిట కొనుగోలు చేసిన కోట్లాది రూపాయల విలువైన అక్రమ ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆస్తులను వెంటనే జప్తు చేయాలని హోం శాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్రిగోల్డ్ కంపెనీల జాయింట్ ఎండీగా వ్యవహరించిన అవ్వా హేమ సుందర వరప్రసాద్ తన అత్త ఎల్లా జయలక్ష్మి పేరిట కృష్ణా జిల్లాలోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో 6.55 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ కొనుగోళ్లన్నీ డిపాజిటర్ల సొమ్ముతోనే జరిగినట్లు నిర్ధారణ కావడంతో వీటి జప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి. అక్రమ పెట్టుబడుల దర్యాప్తు పొరుగు రాష్ట్రాలకూ విస్తరించగా, కర్ణాటకలోని బెంగళూరు జిల్లా అనేకల్ తాలూకా, సర్జాపూర్ హోబ్లీ పరిధిలోని ముత్తనల్లూర్ అమ్మనికేరి గ్రామంలో ఎన్. మమత అనే మహిళ పేరిట ఉన్న 3.32 ఎకరాల భూమిని కూడా గుర్తించారు. ఈ ఆస్తుల జప్తు ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని సీఐడీ డైరెక్టర్ జనరల్ ను ప్రభుత్వం ఆదేశించింది.