కళ్యాణదుర్గం మండలం గూబనపల్లి సమీపంలో గురువారం తెల్లవారుజామున గొర్రెల మందపైకి బొలెరో వాహనం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. కంబదూరు మండలం కర్తనపర్తి గ్రామానికి చెందిన గొర్రెల యజమాని మారెప్పకు చెందిన 500 వందల గొర్రెలు మేత కోసం కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి వెళ్తున్నాయి. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో గూబనపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టింది. 26 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే బొలెరో డ్రైవర్ బండి రోడ్డు పక్కన వదిలి పరారయ్యారు. సుమారు 6 లక్షల వరకు నష్టం జరిగినట్లు గొర్రెల కాపరి మాధవయ్య తెలిపారు. తమకు జరిగిన నష్టాన్ని వాహన యజమాని నుండి చెల్లించేలా చొరవ తీసుకోవాలని బాధిత గొర్రెల యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా గొర్రెలను రహదారిపై లేకుండా పక్కకు తొలగించారు.
andhrapradesh news
డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రామచంద్రపురం లో ప్రమాదవశాత్తు కారు దగ్ధం. తప్పిన పెను ప్రమాదం. మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది. రామచంద్రపురం పట్టణానికి చెందిన ఆర్ ఎస్ వి వి దుర్గాప్రసాద్ కాకినాడ నుంచి రామచంద్రపురం వస్తుండగా స్థానిక ప్రాఫిట్ షూ మార్ట్ వద్దకు వచ్చేసరికి తన మారుతి – 800 కారు షార్ట్ సర్కూట్ కారణంగా ఇంజన్ నుంచి మంటలు చెలరేగాయి. దుర్గా ప్రసాద్ కారులో నుంచి బయటపడడం తో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. పాల్గొన్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ. నందమూరి తారకరామారావు ఒక వ్యక్తి కాదు ఒక ప్రభంజనం. తెలుగు కళామ్మతల్లి ఆశీర్వాదం పొందారు. సంక్షేమం అన్న పదానికి మారు పేరు ఎన్టీఆర్. ఆకలితో అలమటిస్తున్న ఎందరో పేదల్ని రూపాయికి బియ్యం తో ఆదుకొని వారి కడుపు నింపారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశారు. తెలుగు వారు ఆత్మగౌరవంతో తలెత్తుకోగలుతున్నామంటే దానికి కారకులైన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. అందుకే తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్నారు అన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం రుస్తుంబాద కబడి స్టేడియంలో గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్త్రీ , పురుషుల జాతీయస్థాయి కబడ్డీ పోటీలను మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు తో కలిసి ఆర్డీవో అంబరీష్ ప్రారంభించారు. క్రీడాజ్యోతిని వెలిగించి శాంతి కపోతాలను గాల్లో విడిచిపెట్టారు. అనంతరం ఆర్డీవో మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రోత్సహించటం వల్ల ప్రతిభ కలిగిన ఎంతో మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారన్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ కబడ్డీ వంటి గ్రామీణ క్రీడను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో 30 ఏళ్లుగా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. ఐదు రోజులు పాటు జరిగే ఈ పోటీలలో 18 రాష్ట్రాల జట్టు తలపడనున్నాయి. విజేతలకు ఐదు లక్షలు ప్రైజ్ మనీ అందించనున్నారు. ఈనెల 21న ఫైనల్స్ జరగనున్నాయి.






Total views : 91177