పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం బీచ్ లోని చంద్రగ్రహణం రోజున శివాలయంలో ఓ వింత సంఘటన జరిగింది. ఆలయం తలుపులు తెరిచిన పురోహితునికి గర్భగుడిలోని శివలింగం వద్ద త్రాచు పాము దర్శనం ఇచ్చింది. ఒక్కసారిగా షాక్ తిన్న వేద పండితులు రెండు చేతులు జోడించి శివనామ స్మరణం చేస్తూ మంత్రోచ్చారణ చేశారు. వెంటనే ఆ పాము గర్భగుడి మూలకు వెళ్లి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నం చేసింది. అయితే దారి లేకపోవడంతో వచ్చిన దారిలో బయటికి వెళ్ళిపోయింది.ఈ సంఘటన పేరుపాలెంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
lunar eclipse
విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం రాహు గ్రస్త పాక్షిక చంద్ర గ్రహణము కారణంగా అమ్మవారి ఆలయం మూసివేసారు. ఆగమశాస్త్ర ప్రకారము అమ్మవారికి పంచ హారతులను నిలిపివేసి అమ్మవారి ప్రధానాలయం మరియు ఉపాలయములను అర్చకులు కవాట బంధనం చేసారు. గ్రహణకాలం అనంతరం ఆదివారం ఉదయం 3 గంటలకు అమ్మవారి ప్రధానాలయము మరియు ఉపాలయాల కవాట ఉద్ఘాటన చేసి దేవతామూర్తులకు స్నానాభిషేకములు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనము పునః ప్రారంభించబడుతుంది. ఆదివారం తెల్లవారు ఝామున నిర్వహించే ఆర్జిత సేవలు, సుప్రభాతం, వస్త్రం సేవ మరియు ఖడ్గమలార్చన నిలిపివేశారు. ఆ తర్వాత ప్రారంభమయ్యే అన్ని ఆర్జిత సేవలు యధావిధిగా జరుగుతాయి.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు. కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు, రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు.
నిర్మల్ జిల్లా బాసర ఆలయంపై చంద్ర గ్రహణం ఎఫెక్ట్ పడింది. బాసరలో చంద్రగ్రహణం సందర్బంగా అమ్మవారి ఆలయంతో పాటు, అన్ని ఉప ఆలయాలను ఆలయ అధికారులు మూసి వేశారు. వేద పండితులు, ఆలయ ఆర్చకులు రేపు ఉదయం సంప్రోక్షణ, హారతి సమర్పిస్తారు. అనంతరం యధావిధిగా భక్తులకు నాలుగు గంటల నుండి సర్వదర్శన సేవలు ప్రారంభమవుతాయని ఆలయ అధికారులు తెలిపారు.
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.