నీట్ రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ మరోసారి గళమెత్తింది. దేశవ్యాప్తంగా NEETను రద్దు చేయాలని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది.12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య సీట్ల భర్తీకి అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరింది. అయితే తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఎమ్మెల్యే సభ నుంచి వాకౌట్ చేశారు.
తమిళనాడులో NEETపై మరోసారి రాజకీయ పోరు మొదలైంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహిస్తున్న NEETను పూర్తిగా రద్దు చేయాలంటూ తమిళనాడు అసెంబ్లీ తీర్మానం చేసింది. టీవీకే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి పలు ప్రధాన పార్టీలు మద్దతు తెలిపాయి. NEET కారణంగా గ్రామీణ, పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారని ప్రభుత్వం ఆరోపించింది.
నీట్ కు బదులుగా 12వ తరగతి బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించే విధానాన్ని పునరుద్ధరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఖరీదైన కోచింగ్ సెంటర్లపై ఆధారపడాల్సి రావడం వల్ల పేద, గ్రామీణ విద్యార్థులకు సమాన అవకాశాలు దెబ్బతింటున్నాయని పేర్కొంది. పేపర్ లీకేజీలు, పరీక్షలపై నమ్మకం కోల్పోయే ఘటనలు కూడా NEET వ్యవస్థపై ఆందోళనలను పెంచాయని ప్రభుత్వం తెలిపింది.
వైద్య విద్యలో రాష్ట్రాల హక్కులను తిరిగి కల్పించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తీర్మానానికి డీఎంకే, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్ సహా పలు పార్టీలు మద్దతు ఇవ్వగా, బీజేపీ ఎమ్మెల్యే మాత్రం వ్యతిరేకిస్తూ వాకౌట్ చేశారు. దీంతో NEET రద్దు అంశం మరోసారి కేంద్రం–రాష్ట్రాల మధ్య రాజకీయ, విద్యా విధాన చర్చకు కేంద్రంగా మారింది.