అంతర్జాతీయ యాంటీ-డ్రగ్స్ డే సందర్భంగా రాష్ట్ర యువతకు కీలక సందేశాన్ని ఇచ్చారు సీఎం రేవంత్రెడ్డి. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. యువతలో సానుకూల ఆలోచనలు, నైతిక విలువలను పెంపొందించడం ద్వారా మాత్రమే మాదక ద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించగలమని స్పష్టం చేశారు. డ్రగ్స్ సంస్కృతి వల్ల సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా.. అది శాంతిభద్రతల సమస్యలకు కూడా దారితీస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్య సాధనలో యువత, తల్లిదండ్రులు, పౌర సమాజం భాగస్వాములై ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరించాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు డ్రగ్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, సరఫరాను సమూలంగా రూపుమాపేందుకు ఈగల్ ఫోర్స్ సంపూర్ణంగా పనిచేసేలా అన్ని వసతులు కల్పించామని భట్టి వెల్లడించారు. ప్రతి తల్లి-తండ్రి తమ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నట్లే.. ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. డ్రగ్స్ వాడుతూ, సరఫరా చేస్తూ దొరికినవారెవరైనా సరే.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.





Total views : 180102