Thursday, June 18, 2026
News Navigation
Thursday, June 18, 2026
News Navigation

Breaking

Thursday, June 18, 2026
Home Andhra Pradesh విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన.

విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన.

by CVR NEWS
విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ వద్ద నిరసన

ముత్తాతల కాలం నుంచి మట్టిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఆ భూమే ఇన్నాళ్లు వారికి కూడు పెట్టింది. వారి పిల్లల్ని చదివిస్తోంది. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పేరుతో నోట్లో మట్టి కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని కదం తొక్కారు కర్షకులు. ప్రాణాలైనా ఇస్తాం గానీ…. భూములను ఇచ్చేదే లేదని తెగేసి చెబుతున్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి ఎమ్మార్వో ఆఫీస్ సాక్షిగా గుండెలు బాదుకుంటూ రైతులు చేసిన నినాదాలు ఇవి.

తమ జీవనాధారమైన భూమిని కాపాడుకునేందుకు అన్నదాతలు రోడ్డెక్కారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలానికి చెందిన కొండకిండాం, రాచకిండాం, కిండాం అగ్రహారం గ్రామాలకు చెందిన రైతులు బొండపల్లి తహశీల్దార్ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం ప్రభుత్వం దాదాపు 175 ఎకరాల సాగు భూములను స్వాధీనం చేసుకోవాలని చూడటమే ఈ నిరసనకి కారణమైంది. దశాబ్దాలుగా ఆయా భూములను సాగు చేసుకుంటూ… పచ్చని పొలాల పైనే ఆధారపడి జీవిస్తున్న వందలాది రైతు కుటుంబాలు ప్రభుత్వ నిర్ణయంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాయి. పారిశ్రామికీకరణ పేరుతో పచ్చని పంట పొలాలను లాక్కోవాలని చూడటంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధి కల్పిస్తామంటూ తమకు ఉన్న ఉపాధిని దెబ్బతీయడం ఏంటని రైతుల ప్రశ్న.

ఆందోళన జరుగుతున్న సమయానికి బొండపల్లికి జిల్లా కలెక్టర్‌ రాగా. రైతులు, నాయకులు కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. భూసేకరణను తక్షణమే నిలిపివేసి, తమకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఒకవేళ ప్రభుత్వం మొండిగా ముందుకెళ్లి భూములను బలవంతంగా లాక్కోవాలని చూస్తే, తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఏ త్యాగానికైనా సిద్ధమని రైతులు స్పష్టం చేశారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

025300
Total views : 146861

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.