హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు, మైలార్దేవ్పల్లి పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఇద్దరు అంతరాష్ట్ర నేరగాళ్లను అరెస్ట్ చేశారు. మెహఫిల్ హోటల్ సమీపంలో బాలెనో కారును అడ్డగించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 నాటు తుపాకులు , 7 సజీవ బుల్లెట్లు, ఒక బాలెనో కారు, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
అరెస్టైన వారిలో హైదరాబాద్ చార్మినార్ కిల్వత్ ప్రాంతానికి చెందిన కార్ డీలర్ ముదస్సిర్ హుస్సేన్ అలియాస్ షా బాబా, మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన లారీ డ్రైవర్ అమీర్ ఖాన్ ఉన్నారు. షా బాబాపై కర్ణాటకలో డాకోయిటీ, మహారాష్ట్రలో వ్యాపారవేత్త కిడ్నాప్ కేసులు నమోదై ఉండగా, అమీర్ ఖాన్పై హత్య కేసుతో పాటు పలు నేర కేసులు ఉన్నాయి. మైలార్దేవ్పల్లి పరిధిలో పెద్ద నేరానికి కుట్ర పన్నుతున్న సమయంలో వీరిని పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. తుపాకులతో బెదిరించి దారిదోపిడీలకు పాల్పడటం వీరి ప్రధాన నేర కార్యకలాపంగా గుర్తించారు.





Total views : 180158