కాంగ్రెస్ ప్రజా పాలనకు నాలుగు కోట్ల ప్రజల ఆశీర్వాదం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లాలో పర్యటించిన ఆయన సుమారు 13 వేల కోట్లతో ఆర్ అండ్ బీ చేపట్టనున్న హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి శ్రీకారం చుట్టారు. నల్గొండ జిల్లా కనగల్ వేదికగా ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రజలపై ఎలాంటి టోల్ టాక్స్ భారం పడకుండా ఉండేలా డిజైన్ చేసిన హ్యామ్ రోడ్ల పైలాన్ ను ఆవిష్కరించారు. అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో తొలిదశ తాగునీటి ప్రాజెక్టు పనులకు, 83 కోట్లతో తొలిదశ తాగునీటి శుద్ధి కేంద్రం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. సభలో బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు. గతమే.. కానీ భవిష్యత్తు లేదంటూ కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై.. రెండున్నరేళ్ల ప్రజా పాలనపై అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధమా అంటూ సవాలు విసిరారు. మూసీ పునరుజ్జీవ పనులను త్వరలో పూర్తిచేసి నల్గొండ ప్రజలను కాలుష్యం నుంచి విముక్తి చేస్తామన్నారు సీఎం రేవంత్.
ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మూసీ కష్టాలు త్వరలోనే తొలగుతాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మూసీ పునరుజ్జీవంతో జిల్లాలో కాలుష్యాన్ని తగ్గిస్తామని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్, అంతకుముందు కిరణ్కుమార్రెడ్డి ఈ జిల్లాకు నిధులు ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. ఇప్పుడిప్పుడే నిధులు వస్తున్నాయన్నారు. గులాబీ పార్టీపై సెటైర్లు వేస్తూ..పూటకో పేరు మార్చుకునే పార్టీ అని, ఇవాళ బీఆర్ఎస్.. రేపు హెచ్ఆర్ఎస్ అవుతుందని ఎద్దేవా చేశారు. హరీశ్రావు రాష్ట్ర సమితి అవుతుందని అన్నారు.
రాష్ట్రంలో ఇంత పెద్ద మొత్తంలో రోడ్లను అభివృద్ధి చేయడం చారిత్రాత్మకమని జలవనరుల శాఖామంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.13 వేల కోట్లతో 4 వేల కిలోమీటర్లు హ్యామ్ రోడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ను ఆదరించిన ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని అన్నారు. తమ శరీరంలో శక్తి ఉన్నంత వరకు సేవలు అందిస్తామని, తెలంగాణ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని అన్నారు మంత్రి ఉత్తమ్.





Total views : 180102