అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం ఆవసోమవారం గ్రామంలో ఉండాల్సిన కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కనిపించకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది. జీవో ఎంఎస్ నంబర్లు 140, 143 ప్రకారం కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ కోర్సులకు అనుమతులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. 2023లో అనుమతులు పొందిన ఈ కళాశాలకు బీఎస్సీ నర్సింగ్లో ఏడాదికి 60 సీట్లు, జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీకి మరో 60 సీట్లకు అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది.అయితే.. అనుమతులు పొందిన కళాశాల వాస్తవంగా ఎక్కడ నిర్వహించబడుతోంది? అక్కడ విద్యార్థులు చదువుతున్నారా? కళాశాలలో అవసరమైన మౌలిక వసతులు, ఫైర్ సేఫ్టీ, క్లినికల్ అఫిలియేషన్, పరికరాలు, బోధనా సిబ్బంది, ఇతర సిబ్బంది ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
రవి ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ పేరుతో మూడు కళాశాలలకు అనుమతులు పొందినట్లు పేర్కొంటుండగా, కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు జమ అవుతున్నాయన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అసలు కళాశాల ఉనికిపైనే అనుమానాలు ఉంటే.. ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా జరుగుతోందన్న ప్రశ్నలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మెడికల్ కౌన్సిల్, అనకాపల్లి డీఎంహెచ్వో అధికారుల పరిశీలన, భౌతిక తనిఖీలపై కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్పై పూర్తిస్థాయి ఫిజికల్ వెరిఫికేషన్ నిర్వహిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ వ్యవహారంపై సీవీఆర్ న్యూస్ నిఘా బృందం మరిన్ని వివరాలను సేకరిస్తోంది. అధికారిక రికార్డులు, అనుమతులు, ఫిజికల్ వెరిఫికేషన్ అంశాలపై మరింత సమాచారం వెలుగులోకి రానుంది.
కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వ్యవహారంలో అసలు నిజమేంటి? ఎవరి పర్యవేక్షణలో అనుమతులు వచ్చాయి? ఫీజు రీయింబర్స్మెంట్ ఎలా జరిగింది? మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే దిశగా సీవీఆర్ న్యూస్ నిఘా బృందం పరిశోధన కొనసాగిస్తోంది.
అనకాపల్లి జిల్లాలో కైట్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కాలేజ్ మాయం.
13
previous post