పేద ప్రజలకు నివాసం కల్పించాలనే లక్ష్యంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ ఇళ్ల పంపిణీపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట పుదూరులో నిర్వహించిన సభలోపాల్గొన్న చంద్రబాబు ఈ జూన్ నాటికి 2 లక్షల 70 వేల ఇళ్లలో, సెప్టెంబర్ నాటికి లక్షా 60 వేల ఇళ్లలో గృహ ప్రవేశం చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మరో 12 లక్షల ఇళ్లు కూడా కట్టిస్తామని తెలిపారు. ఈ ఇళ్ల అన్నింటికీ పీఎన్జీ కనెక్షన్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అమరావతే మన రాజధాని అని తీర్మానం చేశామని, త్వరలోనే చట్టం తీసుకొస్తామన్నారు.
గోదావరి పుష్కరాల కంటే ముందే.. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఏపీకి సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉందని, మత్స్యకారులకు ఇది ఉపయోగపడాలని అన్నారు. వేట నిషేధం సమయంలో ఇచ్చే ఆర్థికసాయాన్ని 20వేలకు పెంచామన్నారు.
ఈ ప్రాంత చేపలను స్థానిక మత్య్సకారులే పట్టుకోవాలని, ఆ విషయంలో ఇతరులు ఎలాంటి నష్టం కలిగించినా సహించమని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. సాంకేతికతతో ఎప్పటికప్పడు అనుసంధానం చేస్తున్నామన్నారు. అందరికి పనులు ఆలస్యం కాకుండా వెంటవెంటనే జరిగేందుకు మనమిత్ర, వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చామన్నారు చంద్రబాబు. హైదరాబాద్, చెన్నై కంటే అమరావతిని నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని అన్నారు చంద్రబాబు.



Total views : 141735