ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు అట్టడుగు వర్గాలకు అందించాలనే తపన కలిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరామని కదిరి బ్లూమున్ విద్యాసంస్థల అధినేత శివశంకర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మంగళవారం పార్టీ తీర్థం పుచ్చుకున్న కదిరి పట్టణానికి చెందిన బ్లూ మూన్ విద్యాసంస్థల అధినేత శివశంకర్, కాపు సంక్షేమ శాఖ అధ్యక్షులు గవ్వల శ్రీనివాసులు, సైదాపురం చిన్నపరెడ్డి మంగళవారం కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో వారి కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శివశంకర్ మాట్లాడుతూ.. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన పవన్ కళ్యాణ్ సమాజంలోని నిరుపేదలకు అండగా నిలవాలన్న ఆశయాలకు ఆకర్షితులై మేము కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలనే సంకల్పంతోనే పార్టీలో చేరామని చివరి శ్వాస వరకు పవన్ కళ్యాణ్ తోనే రాజకీయ జీవితం కొనసాగుతుందన్నారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ పేదలకు అండగా కార్యకర్తలకు తోడుగా నిరంతరం పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
Tag: