రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రస్తుతం లక్ష మందికి పైగా అనర్హులు అక్రమంగా నెలవారీ పెన్షన్లు పొందుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా కొందరు పెన్షన్ నగదును డ్రా చేస్తున్నట్లు నిఘా వర్గాలు, క్షేత్రస్థాయి పరిశీలనలో తేలింది.
సాంకేతికత ఆధారంగా చేపట్టిన లైఫ్ అథెంటికేషన్ ప్రక్రియ ద్వారా ఈ అక్రమాలు బయటపడటంతో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. చనిపోయినవారు, అర్హత లేని వారి పేర్లను పెన్షన్ జాబితా నుంచి శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అనర్హుల తొలగింపుతో మిగిలే నిధులను నిజమైన లబ్ధిదారులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మంది అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుండగా, తాజాగా గుర్తించిన లక్ష మంది అనర్హుల స్థానంలో మరో లక్ష మంది అర్హులకు త్వరలో పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది.
రాష్ట్రంలో మొత్తం దాదాపు మూడు లక్షల మంది కొత్త లబ్ధిదారులకు పెన్షన్ సౌకర్యం అందనున్నట్లు తెలుస్తోంది. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, దివ్యాంగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరట కలిగించనుంది. త్వరలోనే అర్హుల తుది జాబితాను విడుదల చేసి కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో పెన్షన్ వ్యవస్థ ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు.
52
previous post






Total views : 192923