కాంగ్రెస్ మేనిఫెస్టో మాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటిదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేనిఫెస్టో గ్యారింటీలను అభయహస్తం ద్వారా తెలంగాణ సమాజానికి అంకితం చేస్తున్నామన్నారు. అహంకారపూరితమైన పాలనను తెలంగాణ ప్రజలు ఇప్పటి వరకు చవి చూశారన్నారు. రాష్ట్ర ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్ట ఉన్నదన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందన్నారు. తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ తుఫాన్ వీయబోతుందని, సునామీ సృష్టించబోతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడి ప్రజల జీవితాలలో వెలుగు నింపేందుకు మనస్పూర్తిగా ఈ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.