అమెరికా కాలిఫోర్నియాలోని శాంటాక్రూజ్ కౌంటీ తీరంలో పెను విషాదం చోటుచేసుకుంది. సముద్ర తీరంలో అలసటతో నిద్రిస్తున్న ఇద్దరు భారతీయ సంతతికి చెందిన కాలేజీ విద్యార్థినులు.. అలల తాకిడికి సముద్రంలోకి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. మృతులను కాలిఫోర్నియాలోని ఫ్రీమాంట్ నగరానికి చెందిన హర్షిత నాయర్, మహియాల్ శ్రాన్లుగా అధికారులు గుర్తించారు. ఈ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రీమాంట్లోని వాషింగ్టన్ హైస్కూల్లో 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
పాంథర్ బీచ్, ఎల్లో బ్యాంక్ బీచ్ మధ్య ఉన్న ‘కీహోల్’ అనే సహజ రాతి గుహ ద్వారం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో వారు అక్కడ నిద్రిస్తుండగా, వేగంగా దూసుకొచ్చిన అలలు వారిని సముద్రంలోకి లాగేశాయి. సమాచారం అందుకున్న వెంటనే కాల్ ఫైర్, స్టేట్ పార్క్స్, స్థానిక అగ్నిమాపక సిబ్బందికి చెందిన 8 మంది రెస్క్యూ స్విమ్మర్లు రంగంలోకి దిగారు. తీవ్రంగా శ్రమించి ఒక యువతిని హెలికాప్టర్ ద్వారా, మరొకరిని స్టోక్స్ బాస్కెట్ సాయంతో తీరానికి చేర్చారు. ఐతే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో జాతీయ వాతావరణ సంస్థ తీరప్రాంతమంతటా ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ప్రమాదం జరిగిన ఈ వన్-మైల్ తీరప్రాంతం అత్యంత ప్రమాదకరమైన పెద్ద అలలకు ప్రసిద్ధి చెందింది. ఈ ఒక్క నెలలోనే ఇక్కడ జరిగిన ఐదో సముద్ర రెస్క్యూ ఆపరేషన్ ఇది. ‘కీహోల్’ గుహ ద్వారా అవతలి బీచ్కి వెళ్లే పర్యాటకులు..పోటు వచ్చినప్పుడు నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి ఊహించని విధంగా చిక్కుకుపోతారని తెలిపారు స్థానిక అధికారులు.




Total views : 146770