భారత ప్రధాని నౌకాదళానికి మరింత బలం చేకూర్చేలా ఐఎన్ఎస్ దుణగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు. కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ప్రారంభించారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధనకు ఈ నౌకలు నిదర్శనమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ప్రాజెక్ట్–17A కింద నిర్మించిన ఐఎన్ఎస్ దుణగిరి.. 149 మీటర్ల పొడవైన అడ్వాన్స్డ్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. అత్యాధునిక రాడార్లు, సెన్సర్లు, బ్రహ్మోస్ యాంటీ షిప్ క్రూజ్ క్షిపణులతో ఈ యుద్ధనౌకను సన్నద్ధం చేశారు. సముద్రంలో బహుముఖ ఆపరేషన్లు నిర్వహించే సామర్థ్యం దీని ప్రత్యేకత. 110 మీటర్ల పొడవున్న ఐఎన్ఎస్ సంశోధక్ను సముద్ర సర్వేలు, నావిగేషన్ అధ్యయనాలు, పోర్టుల అభివృద్ధి, సముద్ర మార్గాల మ్యాపింగ్ కోసం రూపొందించారు. ప్రత్యేక హెలికాప్టర్ సదుపాయంతో పాటు విపత్తుల సమయంలో సహాయక చర్యలు చేపట్టేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది.
77.6 మీటర్ల పొడవున్న ఐఎన్ఎస్ అగ్రయ్ను యాంటీ సబ్మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్గా అభివృద్ధి చేశారు. తీర ప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించడం, శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం, దాడులు నిర్వహించడం వంటి విధులకు ఇది అనువుగా ఉంటుంది. 88 శాతం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ నౌకలో 30 ఎంఎం నేవల్ గన్, వాటర్ జెట్ ఆధారిత డీజిల్ ఇంజిన్ వ్యవస్థను అమర్చారు. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ మూడు యుద్ధనౌకల చేరికతో భారత నౌకాదళం మరింత ఆధునికంగా, మరింత శక్తివంతంగా మారనుంది.
ఐఎన్ఎస్ దుణగిరి, సంశోధక్, అగ్రయ్ను జాతికి అంకితం చేసిన ప్రధాని.
327
previous post