ఏలూరు జిల్లా కలిదిండి మండలంలో మీ భూమి–మీ హక్కు కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రులు రైతులతో ముఖాముఖి మాట్లాడారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు, పట్టాలు పంపిణీ చేశారు.
రైతుల సమస్యలు పరిష్కరించేందుకే తాను ఇక్కడికి వచ్చానని సీఎం చంద్రబాబు న్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నామని తెలిపారు. రైతులకు అత్యంత ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసుపుస్తకాలేనని.. ఈ సమస్యను పరిష్కరించాలని సంకల్పం తీసుకున్నానని చెప్పారు.
ఇకపై ప్రతి నెల 9వ తేదీన రైతుల వద్దకు వెళ్లి పట్టాదారు పాసుపుస్తకాలు అందజేస్తానని చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలోని 9,365 గ్రామాల్లో పాసుపుస్తకాలు ఇవ్వాల్సి ఉందని, 68 లక్షల మందికి పాసుపుస్తకాలు అందించే వరకు అధికారులను వదిలిపెట్టనని స్పష్టం చేశారు.
కొత్త పాసుపుస్తకాల్లో అత్యాధునిక భద్రతా ప్రమాణాలు అమలు చేశామని సీఎం తెలిపారు. కరెన్సీ తయారీ తరహాలో పాసుపుస్తకాలను రూపొందించామని, ట్యాంపరింగ్కు అవకాశం లేకుండా బ్లాక్చెయిన్ టెక్నాలజీని ఉపయోగించామని చెప్పారు. పాసుపుస్తకంలోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే భూమికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చన్నారు. వారసత్వంగా వచ్చిన భూములను సులభంగా బదిలీ చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఏలూరు జిల్లాలో రహదారుల సమస్య కూడా కీలకంగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం సూపర్హిట్ అయిందని అన్నారు. సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పామని.. అదే విధంగా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆర్థిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను తానే తీసుకుంటానని చెప్పారు. ఇంటింటికీ నల్లా ద్వారా తాగునీరు అందిస్తామని, ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ను రూపాయిన్నరకే అందిస్తామని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తున్నామని తెలిపారు.రౌడీలకు సింహస్వప్నంగా ఉంటామని సీఎం హెచ్చరించారు. గత రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ.. బాబాయిని చంపి నా చేతిలో గొడ్డలి పెట్టారని వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ రాష్ట్రానికి దౌర్భాగ్యమని చంద్రబాబు విమర్శించారు.