Wednesday, May 13, 2026
News Navigation
Wednesday, May 13, 2026
News Navigation

Breaking

Wednesday, May 13, 2026
Home Telangana ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మరో సంచలనం..

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో మరో సంచలనం..

by Satya
Phone Tapping

తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌(Phone Tapping) వ్యవహారంలో బ్రహ్మపదార్థం ఏంటో తెలిసింది. అప్పటి ముఖ్యమంత్రి పాత్ర బట్టబయలయ్యింది. ప్రధానంగా ఈ కేసులో కీలకంగా ఉన్న అప్పటి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావు(Radhakishan Rao) పోలీసు కస్టడీలో నోరు విప్పారు. అప్పుడేం జరిగిందో, ఎలా జరిగిందో, ఏమేం చేశామో అంతా బయటపెట్టేశారు. దీని వెనుక ఉన్న మాస్టర్‌మైండ్‌ పేరు కూడా చెప్పేశారు. ఆ పెద్దాయన కోసమే అంతా చేశామని గుట్టు విప్పేశారు. దీంతో, ఇప్పుడు అసలు బండారం తెలంగాణ పోలీసుల గుప్పిట్లో చేరింది. ఇక, వాళ్లు ఎలా ముందుకెళ్తారన్నదే మిగిలి ఉంది.

బీఆర్‌ఎస్‌ హయాంలో హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ను ఓ ఆట ఆడుకున్న అప్పటి డీసీపీ రాధాకిషన్‌రావు తాము చేసిన వ్యవహారాలన్నీ బయటపెట్టేశారు. ప్రధానంగా కేసీఆర్‌ కోసమే అంతా చేశామని రాధాకిషన్‌ వాంగ్మూలం ఇచ్చారు. గిట్టనివాళ్లందరినీ లొంగదీసుకున్నామని చెప్పారు.

పెద్దాయనకు చిన్న విమర్శ చేసినా చికాకే అని రాధాకిషన్‌ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. అందుకే కేసీఆర్‌కు ఏమాత్రం నచ్చని నిరసనలు, ఆందోళనలను పూర్తిగా అణచివేశామన్నారు. అయితే, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డామన్నారు. వీటికి సంబంధించిన ఆదేశాలన్నీ పోలీస్‌ కమిషనర్‌ ద్వారానే వచ్చేలా చూసుకున్నామని రాధాకిషన్‌ చెప్పారు. ఇక, విపక్షనేతలు, కేసీఆర్‌కు ఇబ్బందిగా ఉన్నవాళ్లు, కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేవాళ్లు, వాళ్లకు సంబంధించిన వాళ్లందరి ఫోన్లపైనా నిఘా పెట్టామన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారా ప్రణీత్‌కుమార్‌ ఇచ్చే వివరాలను క్రోడీకరించి అందరిమీదా ఎటాక్‌ చేశామని రాధాకిషన్‌ రావు చెప్పారు. అంతేకాదు.. సివిల్‌ తగాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు కూడా చేశామని అప్పటి తమ దుర్మార్గాలను కూడా పోలీసులకు చెప్పేశారు. ఇక, ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల నగదు తరలింపును ఎలా అడ్డుకున్నామో కూడా బయటపెట్టేశారు. అదే సమయంలో అధికారపార్టీ బీఆర్‌ఎస్‌ డబ్బు రవాణాకు కూడా సహకరించామని రాధాకిషన్‌రావు పోలీసులకు విచారణలో వెల్లడించారు.

పోలీసు కస్టడీలో రాధాకిషన్‌రావు.. స్పష్టంగా కేసీఆర్‌ పేరు చెప్పారని చెబుతున్నారు. అలాగే, ఆయన వాంగ్మూలంలో పలువురు బీఆర్‌ఎస్‌ నేతల పేర్లు కూడా ఉన్నాయంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నాటి ఎస్‌ఐబీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు ప్రధానపాత్ర పోషించినట్లు రాధాకిషన్‌ రావు వెల్లడించారంటున్నారు. అయితే, ఎక్కడా తేడా రాకుండా, విషయం బయటకు రాకుండా, ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్తపడ్డామని రాధాకిషన్‌రావు పేర్కొన్నారు.

ఇక, ఈ మొత్తం వ్యవహారంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పార్ట్‌-2 ఉండబోతోందని పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఇకపై ఏం జరగబోతోంది? కేసీఆర్‌ అరెస్ట్‌ తప్పదా? ఆయనతో పాటు.. మరికొందరు బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు, కేసీఆర్‌ సన్నిహితులను కూడా పోలీసులు అరెస్ట్‌ చేయబోతున్నారా? అన్నది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

Follow us on : FacebookInstagramYouTube & Google News


మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Advertisements

You may also like

Our Visitor

012366
Total views : 74832

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.