శ్రీకాకుళం జిల్లాలో విద్యా వ్యాపారం పేరుతో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా హైవే పక్కన ఉన్న సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రస్తుతం వివాదాల కేంద్రంగా మారింది. బయటకు ఆకర్షణీయమైన భవనాలు, ఏసీ క్లాస్రూమ్లు చూపిస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకుంటున్న యాజమాన్యం… లోపల మాత్రం నిబంధనలను పూర్తిగా గాలికొదిలేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అనుమతులు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు రెన్యువల్ కాకపోవడం వంటి కీలక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అయినప్పటికీ లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై భారీ భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తమవుతోంది. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం వంటి అంశాల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్పే ప్రదేశం ఇలా అక్రమాలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు జిల్లా విద్యా వ్యవస్థపై పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
సంస్కార్ ఇంటర్నేషనల్ స్కూల్పై వస్తున్న ఆరోపణలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. స్కూల్ బస్సులు హైవేపై రాంగ్ రూట్లో నడుస్తూ విద్యార్థుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. రోజంతా ఏసీ గదుల్లో ఉంచి, ఆపై ఎండలో వ్యాయామం చేయించడం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. స్కూల్ పక్కనే స్మశానం ఉండటం కూడా మరో వివాదానికి కారణమైంది. ఇన్ని సమస్యలు బయటపడుతున్నప్పటికీ… అధికారుల చర్యలు మాత్రం కనిపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందిస్తామని చెప్పినా, క్షేత్రస్థాయిలో మార్పు లేదని స్థానికులు అంటున్నారు. దీంతో అధికారులు యాజమాన్యం ఠీ కుమ్మక్కైయ్యారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, విద్యార్థుల భద్రతను నిర్ధారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.




Total views : 54869