తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రత, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళలు, చిన్నారుల తక్షణ రక్షణ కోసం ఏర్పాటు చేసిన స్పందన టీమ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న మహిళా సంక్షేమ పథకాలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు, చిన్నారులకు వేగంగా రక్షణ కల్పించడమే ఈ టీమ్ల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. స్పందన సభ్యులకు బాధితుల పట్ల ఎలా వ్యవహరించాలి, నిందితులను ఎలా అదుపు చేయాలనే అంశంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఒక్కో ఏసీపీ జోన్కు రెండు స్పందన టీమ్లను కేటాయించారు. ఇవి డయల్ 100, 112లతో అనుసంధానమై నిరంతరం అందుబాటులో ఉంటాయన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే ఎటువంటి ఆలస్యం లేకుండా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు భరోసా కల్పిస్తారని తెలిపారు.
మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక మార్పులను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించారు. రాష్ట్రంలోని 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆర్టీసీలో 1000 బస్సులకు మహిళలనే యజమానులను చేశామని, సోలార్ ఎనర్జీ బిజినెస్లోనూ వారిని భాగస్వాములను చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా క్యాంటీన్లు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శం పథకం ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యతలను మహిళలకే అప్పగించామని గుర్తు చేశారు.




Total views : 140874