తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇటీవలి ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం విజయ్ నేతృత్వంలోని TVK కూటమికి అనూహ్య మద్దతు లభించింది. అన్నాడీఎంకేలోని సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం తమ మద్దతును ప్రకటించింది. ఈ పరిణామంతో విజయ్ ప్రభుత్వం మరింత బలోపేతమైంది. త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్తో భేటీ కానున్నట్లు తెలిపారు షణ్ముగం.
గత దశాబ్ద కాలంగా అన్నాడీఎంకే ఎదుర్కొంటున్న వరుస ఓటములే తమ నిర్ణయానికి కారణమని షణ్ముగం వివరించారు. దశాబ్దాలుగా బద్ధ శత్రువుగా ఉన్న డీఎంకే చేతిలో మూడుసార్లు, గత నెలలో జరిగిన ఎన్నికల్లో టీవీకే చేతిలో ఓటమి పాలైన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. “పార్టీని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉందని.. దాని భవిష్యత్తు గురించి చర్చించాలన్నారు. టీవీకేను అధికారంలోకి రాకుండా ఆపేందుకు, డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం పళనిస్వామి చేసిన ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని షణ్ముగం స్పష్టం చేశారు.
53 ఏళ్లుగా మన రాజకీయాలు డీఎంకేకు విరుద్ధంగానే సాగాయన్న షణ్ముగం..డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనను మెజారిటీ వర్గం తిరస్కరించిందన్నారు. ఒకవేళ అలాంటి పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే మనుగడే ఉండేది కాదని ఆయన స్పష్టం చేశారు. అయితే, అన్నాడీఎంకేను చీల్చే ఉద్దేశం తనకు లేదన్న షణ్ముగం..పార్టీని బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. అందుకే ఎన్నికల్లో గెలిచిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మొత్తం 234 స్థానాలకు గాను విజయ్ పార్టీ 108 సీట్లు గెలుచుకుంది. మెజారిటీకి 10 సీట్ల దూరంలో నిలిచిపోయింది. కాంగ్రెస్ 5 సీట్లతో మద్దతివ్వగా, రెండు వామపక్ష పార్టీలు (4), వీసీకే (2) మద్దతుతో టీవీకే ప్రభుత్వం ఏర్పడింది. అయితే, ఈ పార్టీలన్నీ డీఎంకేకు దీర్ఘకాల మిత్రపక్షాలు కావడంతో ప్రభుత్వ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. తాజాగా షణ్ముగం వర్గం మద్దతుతో విజయ్ సర్కారుకు రాజకీయంగా మరింత స్థిరత్వం లభించినట్లయింది.






Total views : 74955