23
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోజికోడ్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు బిడాడి సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. వర్షంలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి రహదారిపై ఉన్న ఓవర్హెడ్ సైన్బోర్డు నిర్మాణాన్ని ఢీకొట్టిన అనంతరం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మిథిలేష్, కండక్టర్ అరుణ్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షమే ప్రమాదానికి కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.